ఉత్తరాఖండ్ వేదికగా ఆతిథ్యమిచ్చిన ప్రతిష్టాత్మక 38వ జాతీయ క్రీడలు ఘనంగా ముగిశాయి. మొత్తంగా ఈ క్రీడల్లో తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన అథ్లెట్లు మంచి ప్రదర్శన కనబరిచారు. పతకాల పంట పండించారు. ఇంతకీ ఎన్ని పతకాలు సాధించారో తెలుసుకుందాం..
ఈ నేషనల్ గేమ్స్ లో తెలుగు అథ్లెట్లు చెప్పుకోదగ్గ ప్రదర్శనే చేశారు. పోటీల్లో భాగంగా చివరి రోజు తెలంగాణ ఖాతాలో మరో రెండు కాంస్య పతకాలు వచ్చి చేరాయి. షూటింగ్, నెట్బాల్లో తెలంగాణ అథ్లెట్లు రాణించారు. షాట్గన్ స్కీట్ మిక్స్డ్ విభాగంలో బత్తుల మునెక్ - రష్మీ రాఠోడ్ ద్వయం కంచు పతకం సాధించింది. మిక్స్డ్ నెట్ బాల్ ఈవెంట్ లో తెలంగాణ బ్రాంజ్ మెడల్ దక్కించుకుంది.

18,26 స్థానాల్లో..
మొత్తంగా ఈ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ 12 పతకాలను సాధించింది. 7 పసిడి పతకాలు, ఒక రజతం, 6 కాంస్యాలను ఖాతాలో వేసుకుని 18వ స్థానంలో నిలిచింది. తెలంగాణ 3 గోల్డ్ మెడల్స్, 3 రజత పతకాలు, 12 కాంస్య పతకాలను సాధించి మొత్తంగా 18 మెడల్స్ అందుకుని 26వ స్థానంతో ముగించింది.
అగ్రస్థానంలో ఉన్న జట్టు ఇదే
ఈ నేషనల్ గేమ్స్ లో సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డ్ అగ్ర స్థానంలో నిలిచింది. 121 పతకాలను ఖాతాలో వేసుకుని తొలి స్థానంలో నిలిచింది. 68 గోల్డ్ మెడల్స్, 26 సిల్వర్ మెడల్స్, 27 బ్రాంజ్ మెడల్స్ ను సొంతం చేసుకుంది. తద్వారా ఈ క్రీడల్లో టాప్ ర్యాంకులో నిలిచింది.
రెండు, మూడు స్థానాల్లో ఎవరున్నారంటే?
సర్వీసెస్ తర్వాత మహారాష్ట్ర రెండో స్థానాన్ని అందుకుంది. 54 పసిడి పతకాలు, 71 రజత పతకాలు, 73 కంచు పతకాలతో మొత్తంగా 198 పతకాలను సాధించింది. హరియాణా 48 బంగారు పతకాలు, 47 రజతాలు, 58 బ్రాంజ్ మెడల్స్ ను గెలుచుకుని మూడో స్థానంలో నిలిచింది. మొత్తంగా 153 మెడల్స్ ను ఖాతాలో వేసుకుంది.
మొత్తంగా సర్వీసెస్ కన్నా మహారాష్ట్ర, హరియాణా ఎక్కువ పతకాలను సాధించినప్పటికీ రెండు, మూడు స్థానాలతో సరిపెట్టుకున్నాయి. ఎందుకుంటే ఈ రెండు రాష్ట్రాలు స్వర్ణాల్లో వెనకబడ్డాయి. సర్వీసెస్ ఎక్కువ బంగారు పతకాలను సాధించుకుంది.