హైదరాబాద్: ఆగస్టులో ఇండోనేషియా రాజధాని జకార్తా వేదికగా ఆసియా గేమ్స్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఆసియా గేమ్స్లో అద్భుతంగా రాణించిన ఆటగాళ్లను క్రీడా అవార్డుల కోసం పరిగణనలోకి తీసుకుంటామని కేంద్ర క్రీడాశాఖ పేర్కొంది.
ఇందులో భాగంగా ప్రతిఏటా భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆగస్టు 29న నిర్వహించే క్రీడా అవార్డుల కార్యక్రమాన్ని సెప్టెంబర్ 25కు వాయిదా వేయాలని నిర్ణయించింది. ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 2 తేదీ వరకు ఆసియా గేమ్స్ జరుగుతున్న నేపథ్యంలో క్రీడా మంత్రిత్వశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
ఆసియా గేమ్స్లో సత్తాచాటిన వారి పేర్లను కూడా అవార్డులకు పరిశీలిస్తామని పేర్కొంది. నిజానికి అవార్డుల కోసం ఆయా క్రీడా సమాఖ్యల నుంచి ఆటగాళ్ల పేర్లను పంపించేందుకు ఏప్రిల్ 30ని ఆఖరి గడువుగా నిర్దేశించిన సంగతి తెలిసిందే. కానీ ఈ ఏడాది అందుకు భిన్నంగా కేంద్రం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.
దీంతో ఆటగాళ్లతో పాటు కోచ్లు, అధికారులకు అవార్డులు దక్కుతాయి. తేదీల మార్పు అంశాన్ని రాష్ట్రపతి భవన్ దృష్టికి తీసుకెళ్లగా అక్కడి నుంచి కూడా సానుకూల స్పందన వచ్చినట్లు క్రీడా కార్యదర్శి రాహుల్ భట్నాగర్ తెలిపారు. దీంతో పాటు ఆసియా క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన వారి పేర్లను కూడా అవార్డుల కోసం పరిశీలించాలని కమిటీకి సూచించినట్లు ఆయన పేర్కొన్నారు.