బ్యాడ్మింటన్లో బుల్లెట్లా
ఎప్పట్లాగే తనకు అలవాటైన రీతిలో బ్యాడ్మింటన్లో అదరగొడుతున్నారు. ఒలింపిక్స్లో అలవోకగా విజయాలను సాధిస్తూ పతకం వైసు దూసుకెళ్తోన్నారు. ప్రత్యర్థులను చిత్తు చేస్తోన్నారు. ఈ ఉదయం జరిగిన గ్రూప్ దశ రెండో మ్యాచ్లో ఆరో సీడ్ పీవీ సింధు తడాఖా చూపారు. ప్రపంచ ర్యాంకింగ్లో 34వ స్థానంలో ఉన్న హాంకాంగ్ ప్లేయర్ ఛెయుంగ్ ఎన్గన్ యీపై ఏకపక్ష విజయాన్ని సాధించారు. 21-9, 21-16 వరుస సెట్ల తేడాతో నెగ్గారు. ఈ విజయంతో తన పూల్లో పీవీ సింధు అగ్రస్థానాన్ని సుస్థిర చేసుకున్నారు.
డెన్మార్క్ ప్రత్యర్థితో ప్రీ క్వార్టర్స్..
ప్రీ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్లో ఆమె డెన్మార్క్కు చెందిన మియా బ్లిచ్ఫెల్డ్ను ఎదర్కొనాల్సి ఉంది. ఈ మ్యాచ్లో కూడా పీవీ సింధు ఆధిపత్యాన్ని ప్రదర్శించే అవకాశం ఉంది. కాగా- హాంకాంగ్ క్రీడాకారణితో జరిగిన ఈ మ్యాచ్లో పీవీ సింధు అసాంతం తన ఆధిపత్యాన్ని కొనసాగించారు. తొలి సెట్ను అలవోకగా నెగ్గారు. సిందు ఆడిన డ్రాప్ షాట్లను ఛెయుంగ్ సమర్థవంతంగా అడ్డుకోలేకపోయారు. పొరపాట్లు చేశారు. వాటన్నింటినీ పీవీ సింధు సద్వినియోగం చేసుకున్నారు.
రెండో సెట్లో విశ్వరూపం..
రెండో సెట్లో ఛెయుంగ్ ప్రతిఘటించారు. 6-6, 7-7,7-8.. ఇలా పీవీ సింధుతో పోటీ పడ్డారు. 13వ సెట్ వరకూ ఛెయుంగ్.. పీవీ సింధు ఆధిక్యాన్ని అదుపులో పెట్టారు. ఆ తరువాత సింధు రెచ్చిపోయారు. డ్రాప్ షాట్ల, ఫోర్ హ్యాండ్ షాట్లతో గుక్కతిప్పుకోనివ్వలేదు. పీవీ సింధుతో పోటీ పడలేకపోయారామె. 15-14 వద్ద ప్రారంభమైన సింధు ఆధిపత్యం చివరి వరకూ కొనసాగింది. ప్రతి సెట్లోనూ రెండేసి పాయింట్లను పెంచుకుంటూ వెళ్లారు. చివరికి రెండో సెట్ను 21-16 తేడాతో సొంతం చేసుకున్నారు.
ట్రేడ్ మార్క్ డ్రాప్ షాట్స్..
కళ్లు చెదిరే డ్రాప్ షాట్తో ఆమె తన మ్యాచ్ను ముగించారు. 19-16తో ఆధిక్యతలో ఉన్న సమయంలో పీవీ సింధు కొట్టిన ఓ డ్రాప్ షాట్కు ఛెయుంగ్ వద్ద సమాధానమే లేకపోయింది. మెరుపులా వచ్చిన షటిల్ను అందుకోవడానికి కనీసం ప్రయత్నం కూడా చేయలేదామె. ఛెయుంగ్ కాళ్ల మీదుగా ఆడిన ఆ షాట్ను కన్ను మూసి తెరిచే లోపలే గ్రౌండ్ను తాకింది. ఈ షాట్ చూసిన తరువాత.. ఛెయుంగ్ కోచ్ కూడా పీవీ సింధును అభినందించకుండా ఉండలేకపోయాడు. చప్పట్లు కొడుతూ గ్రీట్ చేశాడు.
|
నమస్తే పెడుతూ
మ్యాచ్ ముగిసిన అనంతరం పీవీ సింధు.. తన ప్రత్యర్థిని నమస్కరించడం కనిపించింది. మ్యాచ్ ముగిసిన తరువాత సాధారణంగా ప్రత్యర్థులిద్దరూ నెట్ వరకు వచ్చి చేతులు కలుపుకొని అభినందనలు తెలుపుకోవడం సహజం. ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ఈ పరిస్థితుల్లో చేతులు కలుపుకోవడానికి, ఆలింగనం చేసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అథ్లెట్లు. అందుకే- పీవీ సింధు.. భారతీయ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా నమస్తే పెడుతూ ప్రత్యర్థిని, ఆమె కోచ్ను గౌరవించారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ను టోక్యో ఒలింపిక్స్ ఇండియా తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది.