న్యూఢిల్లీ : ఐపిఎల్ తరహాలో మోటార్ స్పోర్ట్స్ ఈవెంట్ లో ప్రతిష్టాత్మకమంగా నిర్వహించనున్న ఐ1 సూపర్ సిరీస్ టోర్నమెంట్ లో హైదరాబాద్ ఫ్రాంచైజీని స్టార్ హీరో అక్కినేని నాగార్జున సొంతం చేసుకున్నారు. ఇప్పటికే మూడు జట్లకు సంబంధించిన ఫ్రాంచైజీల ఓనర్లు ఖరారు కాగా, మంగళవారం హైదరాబాద్ ఫ్రాంచైజీ యాజమానిని నిర్వాహకులు అధికారకంగా ప్రకటించారు. ఇప్పటికే ముంబై జట్టు బాలీవుడ్ హీరో షారుఖ్ సొంతం చేసుకోగా, ఢిల్లీ జట్టును మేనేజిమెంట్ గురు అరిందమ్ చౌధురి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అలాగే బెంగళూరు జట్టును పిప్పర్ మెంట్ హోటల్స్ వ్యవస్థాపకుడు అర్జున్ బల్జీ చేజిక్కించుకున్నారని సూపర్ సిరీస్ సీఈవో ఎం.దర్శన్ తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు జట్ల యజమానులను ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు.వచ్చే ఏడాది జనవరిలో ఈ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఈ పోటీల కోసం దేశవ్యాప్తంగా 9 ప్రధాన నగరాల నుంచి ఫ్రాంచైజీలను ఎంపిక చేస్తున్నారు. మచ్ దార్ మోటార్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభమయ్యే ఈ రేస్ లో ఆయా నగరాల పేర్లతో మొత్తం తొమ్మిది జట్లు పాల్గొంటాయి. ఒక్కో జట్టు తరపున ఇద్దరు (స్వదేశీ, విదేశీ) డ్రైవర్లుంటారు. మొత్తం 12 రేసులు జరుగుతాయి. 2 మిలియన్ల అమెరికా డాలర్ల (రూ. 10 కోట్ల 45 లక్షల) ప్రైజ్ మనీ కోసం జరిగే ఈ ఈవెంట్ తొలి రేస్ భారత్ లో జరుగుతుండగా మిగతా రేస్ లు యూఏఈ, మలేసియా, బహ్రెయిన్, కతార్ లో ఉంటాయి.అభిమానుల నుంచి కూడా ఇంకా ప్రోత్సాహం రావాల్సి ఉంది. ఇప్పటిదాకా ఈ క్రీడపై వారు పెద్దగా దృష్టి పెట్టలేదు. సీజన్ ప్రారంభానికి దగ్గరలో ఉండడంతో మేం చాలా ఉత్సుకతతో ఉన్నాం అని దర్శన్ అన్నారు.