హైదరాబాద్: రియో ఒలింపిక్స్ తర్వాత తన జీవితం పూర్తిగా మారిపోయిందని స్పెయిన్ స్టార్ షట్లర్, కరోలినా మారిన్ తెలిపింది. రియో తర్వాత ప్రజలు తనను గుర్తిస్తున్నారని చెప్పింది. ప్రస్తుతం భారత్లో ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్)లో ఆడుతున్న కరోలినా మారిన్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తనకు బ్యాడ్మింటన్లో ఇష్టమైన క్రీడాకారులెవరూ లేరని చెప్పింది.
అయితే స్పానిష్ టెన్నిస్ క్రీడాకారుడు రాఫెల్ నాదల్ తనకు ఐకాన్ లాంటివాడని చెప్పుకొచ్చింది. రియో ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన పీవీ సింధు రూ. 13 కోట్ల మేర నగదు నజరానా అందుకోవడంపై మారిన్ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రియో ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన స్టార్ షట్లర్ పీవీ సింధు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు భారీ నజరానాలు ఇచ్చాయి.

మొత్తం మీద రూ. 13 కోట్ల మేర నగదును సింధు నజరానాగా అందుకుంది. రియో ఫైనల్లో సింధును ఓడించి స్వర్ణం పతకం నెగ్గిన మారిన్కు స్పెయిన్ ప్రభుత్వం రూ. 70 లక్షలు అందజేసింది. 'సింధుకు అందిన మొత్తం విని ఆశ్చర్యపోయాను. ఆమె కోట్లు గడించింది. నాకూ మా ప్రభుత్వం నుంచి నజరానా అందింది. కానీ నేను ఆమె అందుకున్న మొత్తంలో కేవలం పదో, పదిహేను శాతమో పొందాను. పతకాలు గెలిచిన క్రీడాకారులు ఇక్కడ ఎంత పాపులరో నాకు అర్ధమైంది' అని మారిన్ పేర్కొనడం విశేషం.
కాగా, కరోలినా మారిన్ కోచ్ ఫెర్నాండో రివస్ సైతం ఒలింపియన్లకు భారీ పారితోషకాలపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒలింపిక్ ఛాంపియన్లకు కోట్లు గుమ్మరించడం చాలా గొప్ప విషయమని అన్నాడు. బ్రెజిల్లోని రియోలో జరిగిన ఒలింపిక్స్లో మహిళల సింగిల్స్ విభాగంలో కరోలినా మారిన్ స్వర్ణం గెలుచుకున్న సంగతి తెలిసిందే.