
కాలిఫోర్నియా: అమెరికా బాస్కెట్బాల్ దిగ్గజ క్రీడాకారుడు కోబ్ బ్రయింట్ (41) హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించారు. ఆదివారం కాలిఫోర్నియాలోని లాస్ఏంజెల్స్లో హెలికాప్టర్ కుప్పకూలడంతో కోబ్ బ్రయింట్, ఆయన కుమార్తె (13) జియానాతో సహా మొత్తం 9 మంది మృతి చెందారు. బ్రయింట్ ప్రయాణిస్తున్న సికోర్సికీ ఎస్ 76 హెలికాఫ్టర్ లాస్ఏంజెల్స్లోని పశ్చిమాన ఉన్న ఓ కొండను ప్రమాదవశాత్తు ఢీకొంది. బ్రయింట్ వ్యక్తిగత హెలికాప్టర్లో సాంకేతిక లోపం ఏర్పడడం వల్లే ప్రమాదం జరిగినట్లు సమాచారం తెలుస్తోంది. అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కోబ్ బ్రయంట్ మృతిచెందడానికి కొన్ని గంటల ముందు లీబ్రాన్ జేమ్స్ను కొనియాడుతూ ఓ ట్వీట్ చేసారు. ఇదే ఆయన చివరి ట్వీట్ అయింది. 'నన్ను అధిగమించిన నా సోదరుడికి అభినందనలు. నా సోదరుడి పట్ల చాలా గౌరవం ఉంది. గేమ్ను మరింత ముందుకు తీసుకెళతావని ఆశిస్తున్నా కింగ్ జేమ్స్' అని ట్వీట్ చేశారు. #33644 అనే హ్యాష్ టాగ్ కూడా జత చేసారు. అమెరికా నేషనల్ బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ)లో అత్యధిక స్కోర్ చేసిన జాబితాలో మూడో స్థానంలో బ్రయంట్ ఉండగా.. తాజాగా లీబ్రాన్ జేమ్స్ అతన్ని అధిగమించాడు. చివరి ట్వీట్కు 1.9 మిలియన్ లైకులు వచ్చాయి.
కొబ్ బ్రయంట్ బాస్కెట్బాల్ క్రీడలో ఎంతో సంపాదించారు. గతంలో ఫోర్బ్స్ ప్రకటించిన అత్యధిక ధనవంతుల క్రీడాకారుల జాబితాలో బ్రయంట్ చాలా సార్లు తన పేరును నిలుపుకున్నారు. బాస్కెట్బాల్ చరిత్రలో తన కంటూ బ్రయంట్ ఎన్నో రికార్డులు సృష్టించుకున్నారు. అయిదు సార్లు ఎన్బీఏ ఛాంపియన్గా నిలిచారు. 2008, 2012 ఒలింపిక్స్ల్లో అమెరికాకు స్వర్ణ పతకాలు సాధించడంలో బ్రియాంట్ది కీలకపాత్ర. రెండు దశాబ్దాలుగా బాస్కెట్బాల్లో మెరిసిన ఈ అమెరికా దిగ్గజం 2016లో రిటైర్మెంట్ ప్రకటించారు.
కోబ్ బ్రయంట్ హెలికాప్టర్ ప్రమాదంలో అకాలమరణం చెందడం ప్రతీ ఒక్కర్నీ తీవ్రంగా కలచివేసింది. కోబ్ అభిమానులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు ఒబామా ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. 'కాలిఫోర్నియాలోని హెలికాఫ్టర్ ప్రమాదంలో బాస్కెట్బాల్ దిగ్గజం కోబ్ బ్రయింట్తో పాటు మరొకొంత మంది మరణించారని తెలిసింది. ఇది ఎంతో భయంకరమైన వార్త' అని ట్రంప్ ట్వీట్ చేసారు. 'బాస్కెట్బాల్లో కోబ్ ఓ లెజెండ్, కోబ్తో పాటు అతడి కుమార్తె గియానా కూడా ప్రమాదంలో మరణించడం ఎంతో బాధాకరం' అని రాసుకొచ్చారు.