రియో డీ జనీరో: ఒలింపిక్స్ గేమ్స్ 2016లో చాలా ఆశ్చర్యకరమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా ఒలింపిక్స్ 65 కిలోల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ కాంస్య పతక పోటీ ముగింపు దశలో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలు మరింత ఆశ్చర్యానికి గురిచేశాయి.
ఈ పోరులో మంగోలియా రెజ్లర్ గాంజోరిజిన్.. ఉజ్బెకిస్థాన్కు చెందిన ఇక్తియోర్తో తలపడ్డారు. అయితే ఇంకొన్ని క్షణాల్లో బౌట్ ముగుస్తుందనగా ఆధిక్యంలో ఉన్న గాంజోరిజిన్ తొందరపడి సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టాడు. ప్రత్యర్థితో తలపడటం మాని.. పరుగులు పెడుతూ సంబరాల్లో మునిగిపోయాడు.
అంతలోనే అతడి కోచ్లు ఇద్దరూ రింగ్లోకి వచ్చేసి అతడితో జత కలిశారు. అయితే పోటీ ముగియకుండానే సంబరాలు చేసుకున్నందుకు అతడికి జరిమానా పడింది. అతడి ప్రత్యర్థి ఇక్తియోర్ను 8-7తో గెలిచినట్లు ప్రకటించారు.
దీంతో గాంజోరిజిన్, అతడి కోచ్లు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయి అసహనానికి గురయ్యారు. జడ్జీల నిర్ణయాన్ని నిరసిస్తూ కోచ్లు ఇద్దరూ బట్టలు విప్పేసి రింగు చుట్టూ అటుఇటూ తిరిగారు. ఆ తర్వాత బోరున విలపించారు.
కాగా, గాంజోరిజిన్ రిఫరీ విజేతను ప్రకటించే సమయంలో పక్కన నిలబడేందుకు కూడా ఇష్టపడలేదు. మోకాళ్లపై కూర్చుని ప్రార్థన చేశాడు. గట్టిగా ఏడ్చాడు. ఈ క్రమంలో అతడిపై నిషేధం పడే అవకాశాలు కూడా లేకపోలేదు. నిబంధనల ప్రకారం అతనిపై చర్యలు తీసుకోనున్నారు.