
హైదరాబాద్: తన రూమ్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని వరల్డ్ ఛాంపియన్, కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్ మీరాబాయి చాను క్రీడా మంత్రిత్వ శాఖను కోరింది. కుట్రపూరితంగా తనను డోపింగ్ స్కామ్లో ఇరికించడానికి, తాను తినే ఆహారాన్ని ఎవరైనా కల్తీ చేస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఇందులో భాగంగా పటియాలాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్లోని తన రూమ్లోనూ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని క్రీడా మంత్రిశాఖను ఆమె కోరినట్లు భారత వెయిట్లిఫ్టింగ్ ఫెడరేషన్ ఒక ప్రకటనలో పేర్కొంది.
తాను ఎప్పుడైనా బాత్రూమ్కు వెళ్లినప్పుడు, తన అనుమతి లేకుండా రూమ్లోకి వచ్చి ఏదైనా కల్తీ చేయడానికి పాల్పడితే గమనించవచ్చనే ఉద్దేశంతోనే మీరాబాయి చాను తన రూమ్లో కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరిందని వెయిట్లిఫ్టింగ్ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ సహదేవ్ యాదవ్ చెప్పాడు.
కాగా, గత నాలుగేళ్లలో మీరాబాయి చాను 45 డోప్ టెస్టులను ఎదుర్కొన్నప్పటికీ క్లీన్గా బయటపడింది. పాటియాలాలోని నేషనల్ ఫెడరేషన్ క్యాంప్ సందర్భంగా ట్రైనింగ్, భోజనశాల, ఇతర కీలక ప్రాంతాల్లో కెమెరాలను ఏర్పాటు చేయాలని కేంద్ర క్రీడాశాఖను కోరినట్టు వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ ఇప్పటికే చెప్పింది.
ప్రసుత్తం భారత వెయిట్ లిఫ్టర్లు హిమాచల్ ప్రదేశ్లోని సాయ్ సెంటర్లో శిక్షణ పొందుతున్నారు. లిప్టర్లు తమ శిక్షణను పూర్తి చేసుకుని జూన్ 3 నాటికి పాటియాలాలోని నేషనల్ ఫెడరేషన్ క్యాంప్కు రానున్నారు. లిప్టర్లంతా నేషనల్ ఫెడరేషన్ క్యాంప్కు వచ్చే సరికల్లా ట్రైనింగ్ హాల్లో కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు ఫెడరేషన్ తెలిపింది.