
హైదరాబాద్: బాస్కెట్బాల్ దిగ్గజ ఆటగాడు కోబ్ బ్రయంట్ మరణ వార్త తెలిసి తాను తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఆదివారం లాస్ ఏంజిల్స్లో పొగమంచు కారణంగా హెలికాప్టర్ కుప్పకూలి మంటలు చెలరేగడంతో ఎన్బీఎ లెజెండ్ కోబ్ బ్రయంట్(41) మరణించారు.
ఈ హెలికాప్టర్ ప్రమాదంలో బ్రయంట్తో పాటు ఆయన 13 ఏళ్ల కూతురు జియానాతో పాటు మొత్తం తొమ్మిది మంది దుర్మరణం చెందారు. కోబ్ బ్రయంట్ మరణవార్త తెలిసిన వెంటనే మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్లో "'నా ఫేవరెట్ ప్లేయర్ కోబ్ బ్రయంట్, అతడి కుమార్తె మరణ వార్త తెలిసి షాక్కు గురయ్యా. ఇది ఎంతో బాధాకరమైన విషయం" అని ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా బ్రయంట్ సాధించిన విజయాలను మంత్రి కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. కొబ్ బ్రయంట్ మృతితో క్రీడా ప్రపంచం మొత్తం శోకసంద్రంలో మునిగింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా బ్రయంట్ మృతి పట్ల తమ సంతాపాన్ని తెలుపుతున్నారు. కొబ్ బ్రయంట్ బాస్కెట్బాల్ క్రీడలో ఎంతో పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నారు.
బ్రయంట్ తన 20 ఏళ్ల కెరియర్లో పలు రికార్డులు సాధించారు. నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ తరపున ఆడి ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచారు. 18సార్లు ఆల్ టైమ్ స్టార్గా నిలిచారు. 2016లో ఎన్బీఎ నుంచి మూడోసారి ఆల్ టైమ్ స్కోరర్గా రిటైరయ్యారు. 2012 ఒలింపిక్స్లో యూఎస్ టీమ్ తరపున ఆడి రెండు స్వర్ణపతకాలు అందుకున్నారు.