
హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా గేమ్స్లో భారత్ క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. తాజాగా, కాంపౌండ్ ఆర్చరీ టీమ్ ఈవెంట్లో భారత్కు కనీసం రెండు రజతాలు ఖాయమయ్యాయి. మహిళల, పురుషుల జట్లు ఫైనల్ చేరాయి.
తెలుగు ఆర్చర్ జ్యోతి సురేఖ నేతృత్వంలోని మహిళల జట్టు ఆదివారం జరిగిన మహిళల సెమీస్లో 225-222తో చైనీస్ తైపీపై గెలిచి ఫైనల్కు దూసుకెళ్లింది. సురేఖ, ముస్కాన్ కిరార్, మధుమిత కుమారితో కూడిన భారత బృందం ఆరంభంలో తడబడి 55-58, 55-57తో తొలి రెండు సెట్లను చేజార్చుకుంది.

ఆ తర్వాతి రెండు సెట్లను 57-55, 58-52తో నెగ్గి ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. 2014లో ఇంచియాన్ వేదికగా జరిగిన ఆసియా గేమ్స్లో కాంస్యంతో సరిపెట్టుకున్న మహిళల కాంపౌండ్ టీమ్.. ఈసారి మెరుగైన పతకంతో భారత్కు తిరిగి రానుంది.
ఇక, పురుషుల విభాగం సెమీ్సలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ 231-227తో చైనీస్ తైపీపై నెగ్గింది. అభిషేక్ వర్మ, అమన్ సైనీ, రజత్ చౌహాన్తో కూడిన భారత జట్టు నాలుగు సెట్లలో 57-57, 57-56, 58-55, 59-59తో తైపీపై అద్భుత ప్రదర్శన చేసింది.
మంగళవారం జరిగే ఫైనల్లో భారత జట్లు కొరియా జట్లతో తలపడనున్నాయి.