
హైదరాబాద్: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్కు స్వీట్లు అంటే ఎంతో ఇష్టం. వచ్చే ఏడాది టోక్యో ఒలింపిక్స్ను దృష్టిలో పెట్టుకుని ఆమె తినే ఆహారపు అలవాట్లను కఠినతరం చేశారు. రెజ్లింగ్ లాంటి క్రీడలో బరువు ఎంతో ముఖ్యం. టోక్యో ఒలింపిక్స్లో వినేశ్ ఫోగాట్ 53 కేజీల విభాగంలో పోటీ పడుతోంది. ప్రస్తుతం వినేశ్ ఫోగాట్ను 50 కేజీల నుండి 53 కేజీల బరువు పెరిగేందుకు ఆమె కోచింగ్ సిబ్బంది ఒప్పిస్తున్నారు.
గతేడాది ఆసియా గేమ్స్లో వినేశ్ ఫోగాట్ పాల్గొనేందుకు 4 కేజీల బరువు తగ్గిన సంగతి తెలిసిందే. అయితే, టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనేందుకు మళ్లీ వినేశ్ ఫోగాట్ తన బరువుని పెంచుకోవాల్సి వస్తోంది. బరువు పెరగడమే కాదు ఆ బరువుని వచ్చే ఏడాది జరగనున్న టోక్యో ఒలింపిక్స్ వరకు వినేశ్ ఫోగాట్ అలాగే కొనసాగించాలి. ఈ నేపథ్యంలో వినేశ్ ఫోగాట్ బరువు విషయంలో ఆమె కోచింగ్ సిబ్బంది సూచనలు చేస్తున్నారు.
సెప్టెంబర్ మొదటి వారంలో జరిగిన నూర్-సుల్తాన్ టోర్నమెంట్లో వినేశ్ ఫోగాట్ 53 కిలోల విభాగంలో పాల్గొని తన తొలి ప్రపంచ ఛాంపియన్షిప్ పతకాన్ని గెలుచుకున్న సంగతి తెలిసిందే. టోక్యో ఒలింపిక్స్కు ముందు ఆమె ఈ పతకాన్ని కైవసం చేసుకోవడం ఆమెలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపింది.
తాజాగా, దీనిపై ఓ ప్రముఖ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్యూలో వినేశ్ ఫోగాట్ మాట్లాడుతూ "బరువు విభాగాన్ని మార్చడం నాకు చాలా కష్టమైన విషయం. కానీ, నా చుట్టూ ఉన్నవారు, నా కోచ్ నాలో ఆత్మ విశ్వాసం నింపారు. ప్రస్తుతం నేను 53కేజీల విభాగంలో శిక్షణ తీసుకుంటున్నా. ఈ క్రమంలో నా బలాన్ని మెరుగుపర్చుకున్నాను" అని తెలిపారు.
"నిదానంగా నాకు నమ్మకం కలుగుతోంది. వరల్డ్ చాంపియన్షిప్లో పతకం సాధించిన తర్వాత ఈ కేటగిరిలో నేను సత్తా చాటగలనని. ఇప్పుడు నేను ఈ కేటగిరికి తయారీగా ఉన్నాను. నూర్-సుల్తాన్ టోర్నీలో కొన్ని తప్పులు చేశాను. ఒలింపిక్స్కు ముందు వాటిని సరిదిద్దుకోవాలి. కొత్త కేటగిరిలో నా ప్రత్యర్ధులతో జరిగిన అన్ని మ్యాచ్ల్లో విజయం సాధించా" అని ఫోగాట్ తెలిపారు.
గతంతో పోలిస్తే తన ఆహారపు అలవాట్లు ఇప్పుడు మరింత కఠినంగా ఉన్నాయని అన్నారు. తన డైట్పై వినేశ్ ఫోగాట్ మాట్లాడుతూ "ప్రస్తుతం నా డైట్ ప్లాన్ చాలా కఠినంగా ఉంది. స్వీట్లు, నెయ్యి తినవద్దని నా కోచింగ్ సిబ్బంది చెప్పారు. దానినే ఇప్పుడు అనుసరిస్తున్నాను" అని ఫోగాట్ చెప్పుకొచ్చారు.