న్యూఢిల్లీ: ఒలంపిక్ బాక్సర్ ఛాంపియన్ మేరీ కోమ్కు మరో అరుదైన గౌరవం దక్కనుంది. ఈశాన్య రాష్ట్రాలకు ఆమెను బ్రాండ్ అంబాసిడర్గా నియమిస్తూ, కేంద్ర ప్రభుత్వం తీసుకోనున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ అధికారులు ఆదివారం వెల్లడించారు.
డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్రన్ రీజియన్ (డోనర్) నాయకత్వంలో ఈశాన్య రాష్ట్రాలు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు పరిష్కారం చూపే కార్యక్రమాల ప్రచారం కోసం మంత్రి జితేంద్ర సింగ్ నేతృత్వంలో వేసిన కమిటీ మేరీ కోమ్ను ఎంపిక చేసిందని డోనర్ వర్గాలు తెలిపాయి.
త్వరలోనే ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటించనున్నట్లు తెలిపారు. మణిపూర్కు చెందిన 32ఏళ్ల మేరీ కోమ్ బాక్సింగ్లో ఇప్పటివరకు ఐదు ప్రపంచ టైటిళ్లను, ఒక ఒలంపిక్ పతకాన్ని గెలుచుకున్నారు.

ముగ్గురు పిల్లలకు తల్లైన మేరీ కోమ్ వచ్చే ఏడాది రియోడిజనరియోలో జరగనున్న ఒలంపిక్స్ గేమ్స్ అనంతరం తాను బాక్సింగ్ నుంచి వైదొలగనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. 2012లో జరిగిన ఒలంపిక్ గేమ్స్లో కాంస్య పతకం సాధించి ఈశాన్య రాష్ట్రల్లో అధ్బుతమైన ఆటగాళ్లున్నారని దేశానికి చాటింది.
జాతీయ, అంతర్జాతీయ గేమ్స్లో దేశానికి ఎన్నో పతకాలను అందించిన మేరి కోమ్ జీవితం ఆధారంగా బాలీవుడ్లో సినిమాని కూడా రూపొందించారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, మేరి కోమ్ పాత్రను పోషించారు.