హైదరాబాద్: ఆసియా మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్ మేరీ కోమ్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. వియత్నాంలోని హోచిమిన్ సిటీ వేదికగా మంగళవారం జరిగిన ఫైనల్లో ఉత్తర కొరియాకు చెందిన కిమ్ హ్యాంగ్పై 5-0 తేడాతో మేరీ కోమ్ విజయం సాధించింది.
మేరీ కోమ్ 48 కేజీల విభాగంలో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయంతో 48 కేజీల బౌట్లో పసిడి నెగ్గిన తొలి భారత క్రీడాకారిణిగా మేరీ కోమ్ చరిత్ర సృష్టించింది. అంతేకాదు విజయంతో ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో మేరీ కోమ్ గెలిచిన పసిడి పతకాల సంఖ్య ఐదుకి చేరింది.

అంతకముందు సాధించిన నాలుగు పసిడి పతకాలు 51 కేజీల విభాగంలో సాధించడం విశేషం. గతంలో ఆసియా ఛాంపియన్షిప్లో ఇప్పటికే మేరీ కోమ్ నాలుగు సార్లు పసిడి, ఒకసారి రజతం కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. సెమీఫైనల్లో మేరీకోమ్ 5-0తో జపాన్కు చెందిన సుబాస కొమురను చిత్తుగా ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది.
మరోవైపు ఇదే టోర్నీలో సరితా దేవి(64 కేజీ), ప్రియాంక చౌదరి(60 కేజీ) కాంస్య పతకాలు గెలుచుకున్నారు. ఆసియా మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్లో ఫైనల్లో విజయం సాధించిన మేరీ కోమ్పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.