
సింధుకి షాక్:
ఐఓఏ నిర్ణయంతో భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకి షాక్ తగిలింది. టోక్యో ఒలింపిక్స్ టోర్నీ ఆరంభ వేడుకల్లో త్రివర్ణ పతకాన్ని చేతబూని భారత జట్టుని సింధు నడిపించబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ ఐఓఏ తాజాగా భారత పతాకధారులుగా మేరీ కోమ్, మన్ప్రీత్ సింగ్లకి అవకాశమిచ్చింది. కిందటిసారి జరిగిన ఒలింపిక్స్లో పతకం గెలిచిన అథ్లెట్కి పతాకధారిగా ఛాన్స్ లభించేది. దాంతో 2016 రియో ఒలింపిక్స్లో రజతం గెలిచిన సింధుకి అవకాశం దక్కుతుందని అంతా ఊహించారు. కానీ ఐఓఏ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది.

లింగ సమానత్వం పాటించాలనే:
లింగ సమానత్వం పాటించాలనే ఉద్దేశంతో ఈసారి నుంచి ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో ఆయా దేశాలు ఇద్దరు చొప్పున (1 మహిళ, 1 పురుషుడు) క్రీడాకారులకు పతాకధారులుగా వ్యవహరించే అవకాశాన్ని నిర్వాహకులు కల్పిస్తున్నారు. 2016 రియో ఒలింపిక్స్లో షూటర్ అభినవ్ బింద్రా భారత బృందానికి ఫ్లాగ్ బేరర్గా వ్యవహరించాడు. బింద్రా 2008 బీజింగ్ ఒలింపిక్స్లో స్వర్ణం నెగ్గి విశ్వ క్రీడల్లో వ్యక్తిగత విభాగంలో పసిడి పతకం నెగ్గిన ఏకైక భారతీయ ప్లేయర్గా రికార్డు నెలకొల్పాడు. భారత్ తరఫున ఒలింపిక్స్ క్రీడల ప్రారంభోత్సవంలో పతాకధారిగా వ్యవహరించనున్న మూడో మహిళా క్రీడాకారిణి మేరీ కోమ్.

చివరి ఒలింపిక్స్:
మణిపూర్కు చెందిన 38 ఏళ్ల మేరీ కోమ్ కెరీర్లో చివరిసారి ఒలింపిక్స్లో బరిలోకి దిగనుంది. దాంతో ఆమెకు గౌరవప్రద వీడ్కోలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఐఓఏ ఫ్లాగ్ బేరర్గా ఎంపిక చేసింది. 'నా కెరీర్లోని చివరి ఒలింపిక్స్లో పాల్గొంటున్న సందర్భంగా ఈ గౌరవం దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఐఓఏకు, కేంద్ర క్రీడా శాఖకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరోసారి పతకం సాధించేందుకు ప్రయత్నిస్తా' అని మేరీ కోమ్ పేర్కొంది.

మాటలు రావడం లేదు:
భారత్ తరఫున ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో పతాకధారిగా వ్యవహరించనున్న ఆరో హాకీ ప్లేయర్ మన్ప్రీత్ సింగ్. 'నా కెరీర్లో ఇదో గొప్ప ఘట్టం. ఆనందంలో నాకు మాటలు రావడం లేదు. మేరీ కోమ్ లాంటి దిగ్గజ క్రీడాకారిణితో కలిసి ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో భారత్ బృందానికి పతాకధారిగా వ్యవహరించబోతున్నందుకు గొప్ప గౌరవంగా భావిస్తున్నా' అని మన్ప్రీత్ అన్నాడు. టోక్యో ఒలింపిక్స్లో భారత్ నుంచి 18 క్రీడాంశాల్లో మొత్తం 115 మంది క్రీడాకారులు బరిలోకి దిగనున్నారు.


Click it and Unblock the Notifications












