
టోక్యో: జపాన్ వేదికగా రసవత్తరంగా సాగుతోన్న ఒలింపిక్స్లో అయిదో రోజు ఆట మొదలైంది. భారత్ తన ప్రస్థానాన్ని ఆరంభించింది.. మిశ్రమ ఫలితాలతో. అయిదో రోజు తొలి గేమ్లోనే ఓ విజయాన్ని..ఓ పరాజయాన్ని ఎదుర్కొంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ డబుల్స్ కేటగిరీలో ఈ మిక్స్డ్ రిజల్ట్స్ను చవి చూసింది. ఈ కేటగిరీలో భారత్ స్టార్ షూటర్ మనుభాకర్/సౌరభ్ చౌదరి జంట రెండో రౌండ్ క్వాలిఫై కాగా.. యశశ్విని సింగ్ డెస్వాల్/అభిషేక్ వర్మ జోడీ విఫలమైంది.
10 మీటర్ల మహిళల ఎయిర్ రైఫిల్ సింగిల్స్లో మనుభాకర్, యశశ్విని సింగ్ డెస్వాల్ విఫలం అయ్యారు. ఫైనల్స్కు అర్హత సాధించలేకపోయారు. రెండు రోజుల కిందటే ముగిసిన ఈ ఈవెంట్లో మనుభాకర్ 12, యశశ్విని 13వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మిక్స్డ్ డబుల్స్లో మనుభాకర్ ముందంజ వేశారు. తన జోడీ సౌరభ్ చౌదరితో కలిసి రెండో రౌండ్కు అర్హత సాధించారు. తొలి రౌంండ్లో వారిద్దరూ టాప్లో నిలిచారు.
నిజానికి- మనుభాకర్/సౌరభ్ చౌదరి జంటను గోల్డెన్ పెయిర్గా అభివర్ణిస్తారు. 10 మీటర్ల మిక్స్డ్ డబుల్స్ ఎయిర్ రైఫిల్ ప్రపంచ కప్ టోర్నమెంట్లలో అయిదుసార్లు స్వర్ణ పతకాన్ని సాధించింది. జపాన్ కాలమానం ప్రకారం.. ఈ ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ ఈవెంట్లో మనుభాకర్/సౌరభ్ చౌదరి జోడీ కొరియా, ఆస్ట్రేలియాతో తలపడింది. ఒక్కో టీమ్ మూడు సిరీస్ల చొప్పున 10 సార్లు లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంటుంది. అత్యధిక పాయింట్లను సాధించిన జోడీ తదుపరి రౌండ్కు క్వాలిఫై అవుతుంది.
తొలి రౌండ్లో అద్భుతంగా రాణించిన మనుభాకర్/సౌరభ్ చౌదరి జంట రెండో రౌండ్లో విఫలమైంది. మను భాకర్ 186, సౌరభ్ చౌదరి 194 పాయింట్లను సాధించారు. మొత్తంగా 380 పాయింట్లతో భారత్ ఏడో స్థానంలో నిలిచింది. భాకర్-9,10,10, 10, 9, 10, 10, 8, సౌరభ్- Choudhary- 10, 10, 10, 10, 9, 10, 10, 9, 10, 10 పాయింట్లతో తమ రౌండ్లను ముగించారు. ఈ రౌండ్లో రష్యా ఒలింపిక్స్ కమిటీ, చైనా, ఉక్రెయిన్, సెర్బియా, చైనా 2, ఆస్ట్రేలియా, ఇరాన్కు చెందిన షూటర్లతో వారు పోటీ పడ్డారు.