చెస్ వరల్డ్ కప్ ఫైనల్లో భారత యువ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద, ప్రపంచ నెంబర్ వన్ మాగ్నస్ కార్లసన్తో తలపడుతున్న సంగతి తెలిసిందే. ఈ పోటీలో తొలి గేమ్ను వీళ్లిద్దరూ డ్రా చేసుకున్నారు. ఈ క్రమంలో కార్లసన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తను కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్నట్లు చెప్పాడు.
సెమీ ఫైనల్లో నిజత్ అబసోవ్పై గెలిచిన తర్వాత తను అనారోగ్యం పాలైనట్లు వెల్లడించాడు. తనకు ఫుడ్ పాయిజనింగ్ అయిందని, దాంతో రెండ్రోజులుగా ఏమీ తినడం లేదని చెప్పాడు. ప్రజ్ఞానందతో మ్యాచ్ డ్రా చేసుకున్న తర్వాత ఫిడే యూట్యూబ్ ఛానెల్కు కార్లసన్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా తన అనారోగ్యం గురించి మాట్లాడాడు.

కార్లసన్కు సెమీఫైనల్ మ్యాచ్ తర్వాత ఒక రోజు విశ్రాంతి కూడా దొరికింది. కానీ ప్రజ్ఞానందకు దొరకలేదు. అతను ప్రపంచ మూడో ర్యాంక్ ఫాబియానో కరౌనాతో టై బ్రేకర్ మ్యాచ్లు ఆడాల్సి వచ్చింది. వీటిలో గెలిచిన తర్వాతే ఫైనల్ బెర్తును ఖాయం చేసుకున్నాడీ ఇండియన్ గ్రాండ్ మాస్టర్. తద్వారా చెస్ వరల్డ్ కప్ ఫైనల్ చేరిన అత్యంత చిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు.
తన పరిస్థితి గురించి మాట్లాడిన కార్లసన్.. 'నాకు ఒక రోజు రెస్ట్ కూడా దొరికింది. కాబట్టి సాధారణంగా ప్రజ్ఞానందపై నాకు కొంత అడ్వాంటేజ్ ఉండాలి. కానీ కొన్ని రోజులుగా నేను చాలా రఫ్ షేప్లో ఉన్నా. అబసోవ్తో మ్యాచ్ తర్వాత నాకు ఫుడ్ పాయిజనింగ్ అయింది. లాస్ట్ రెండ్రోజులు ఏమీ తినలేకపోయా' అని వెల్లడించాడు.
తనకు ఈ మ్యాచ్ సమయంలో నెర్వస్ ఫీలయ్యే శక్తి కూడా లేదని, అందుకే చాలా కామ్గా ఆడానని కార్లసన్ అన్నాడు. ప్రజ్ఞానందతో మ్యాచ్ ఆరంభంలో కార్లసన్ కొంత టైం తీసుకున్నాడు. దీని గురించి మాట్లాడుతూ.. ప్రజ్ఞానంద మ్యాచ్ ఆరంభించిన ఎత్తుకు తన దగ్గర సమాధానం లేదని, దానికి తాను ప్రిపేర్ అవ్వలేదని మెచ్చుకున్నాడు.