
టోక్యో ఒలింపిక్స్లో కాంస్యంతో సరిపెట్టుకున్న భారత బాక్సర్ లవ్లీనా బోర్గోహీన్ మరోసారి సత్తా చాటింది. ఢిల్లీ వేదికగా జరిగిన మహిళల వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్లో స్వర్ణ పతకంతో చెలరేగింది. ఆదివారం జరిగిన ఫైనల్స్లో 75 కేజీల కేటగిరీలో బరిలో దిగిన ఆమె.. ప్రత్యర్థిని 5-2 తేడాతో చిత్తు చేసి బంగారు పతకం సాధించింది. రెండుసార్లు కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన ఆసీస్ బాక్సర్ కేట్లిన్ పార్కర్ రన్నరప్తో సరిపెట్టుకుంది.
అస్సాంకు చెందిన లవ్లీనా అద్భుతమై పోరాటంతో వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్ ఫైనల్ చేరింది. గతంలో రెండుసార్లు ఈ టోర్నమెంట్లో పాల్గొన్న ఆమె.. రెండు సార్లు కూడా కాంస్య పతకాలతో సరిపెట్టుకుంది. అయితే ఈసారి ఆ జింక్స్ను ఛేదించి బంగారు పతకాన్ని ముద్దాడింది. మొదటి రౌండ్లో ఆధిపత్యం చెలాయించిన లవ్లీనా చాలా పర్ఫెక్ట్ పంచులతో జడ్జిలను మెప్పించింది. అయితే రెండో రౌండ్లో కేట్లిన్ మెరుగైన ప్రదర్శన చేయడంతోపాటు ఒకానొక సమయంలో పైచేయి సాధించినట్లే కనిపించింది.
రెండో రౌండ్లో ప్రత్యర్థికి బాగా దగ్గరగా వెళ్లిన లవ్లీనా మూల్యం చెల్లించుకొని ఈ రౌండ్ కోల్పోయింది. అయితే మూడో రౌండ్లో మాత్రం జాగ్రత్తగా ఆడిన ఆమె మరోసారి సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేసింది. దీంతో తన ఎత్తును చక్కగా యూజ్ చేసుకున్న ఆమె.. మూడో రౌండ్లో కూడా పైచేయి సాధించింది. ఈ విజయంతో ఆమె ఈ టోర్నీలో తన తొలి స్వర్ణ పతకం సాధించింది. అంతకుముందు జరిగిన మరో ఫైనల్లో నిఖత్ జరీన్ కూడా స్వర్ణ పతకం గెలిచిన సంగతి తెలిసిందే.
ఈ ఏడాది జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్లో ఫైనల్ చేరిన నిఖత్ జరీన్, నీతూ గంఘాస్, సవీతీ బూరా, లవ్లీనా నలుగురూ స్వర్ణాలు గెలవడం గమనార్హం. లవ్లీనా స్వర్ణం గెలవడంతో ఆ స్టేడియం అంతా 'భారత్ మాతా కీ జై' నినాదాలతో మార్మోగింది. విజయం తర్వాత మాట్లాడిన లవ్లీనా.. 'నేను అనుకున్న దానిలో కేవలం 90 శాతం మాత్రమే రింగ్లో పెర్ఫామెన్స్ చేయగలిగా. ఇది ఫైనల్ కావడంతో కొంత ఒత్తిడికి గురయ్యా. కానీ దేశానికి స్వర్ణం అందించినందుకు చాలా సంతోషంగా ఉంది' అని ఆనందం వ్యక్తం చేసింది.