న్యూఢిల్లీ: రెండు రోజుల చర్చల అనంతరం జాతీయ క్రీడా విశ్వవిద్యాలయ బిల్లును శుక్రవారం లోక్సభలో ఆమోదించారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా క్రీడా మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ మాట్లాడారు. అంతర్జాతీయ క్రీడాకారుడిని స్పోర్ట్స్ వర్సిటీకి ఛాన్సులర్గా నియమిస్తామన్నారు. ప్లేయర్లను కూడా వర్సిటీ సభ్యులుగా నియమిస్తామని తెలిపారు. క్రీడలు రాష్ట్రం పరిధిలోకి వస్తాయని, గతంలో యూపీఏ ప్రభుత్వం స్పోర్ట్స్ కోడ్ను తీసుకువచ్చిందని, కానీ రాష్ట్రాలు ఆ నియమావళిని అమలు చేయడం లేదన్నారు.
సాధారణంగా వర్సిటీలు క్రీడా పోటీలను నిర్వహిస్తుంటాయని, అయితే ఆ వర్సిటీలు క్రీడాస్ఫూర్తిని పెంపొందించే ప్రక్రియను అలవరుచుకోవాలని మంత్రి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రీడలు.. 80 బిలియన్ల డాలర్ల పరిశ్రమగా మారిందన్నారు. ఇలాంటి సందర్భాల్లో క్రీడలపై శ్రద్ధ చూపాలన్నారు. రీసర్చ్, అడ్మినిస్ట్రేషన్, అంపైరింగ్, ట్రైనింగ్ లాంటి అనేక అంశాలపై స్పోర్ట్స్ యూనివర్సిటీ దృష్టి పెడుతుందని మంత్రి రాజ్యవర్థన్ తెలిపారు. ఆస్ట్రేలియాకు చెందిన కాన్బెరా వర్సిటీతో ఒప్పందం కుదుర్చుకున్నామని, మణిపూర్లో క్రీడా వర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి చెప్పారు.
ఈ విషయమై గురువారం నుంచి లోక్సభలో జాతీయ క్రీడా విశ్వవిద్యాలయ స్థాపన బిల్లుపై కీలకంగా చర్చ జరుగుతూనే ఉంది. అంతేకాకుండా మరో రెండు కీలక బిల్లులను పార్లమెంటు పదోరోజు సమావేశాల్లో ప్రవేశపెడుతున్నారు. అయితే రాజ్యసభ బుధవారం గంటపాటు వాయిదాపడింది. బీజేపీ సభ్యుడు మాజీ క్రికెట్ ప్రతినిధి అనురాగ్ఠాకూర్ మాట్లాడుతూ క్రీడారంగం మొత్తం అవినీతి మయంగా మారిందని, ఖచ్చితంగా పరిశీలనచేయాలిసందేనన్నారు.
ఇంత తక్కువ బడ్జెట్తో భారత్కు పతకాలు ఎలా వస్తాయని ఆయన ప్రశ్నించారు. దేశంలోని విశ్వవిద్యాలయాలు క్రీడలను సరిగా ప్రోత్సహించడం లేదని లోపం తల్లిదండ్రుల దగ్గర కూడా ఉందని విమర్శించారు. ఉద్యోగావకాశాలను బట్టే రంగాన్ని ఎంచుకుంటారని గుర్తు చేశారు. మణిపూర్లో జాతీయ క్రీడా వర్సిటీని స్థాపించేందుకు ఎంపికచేయడం సంతోషకరమని కేంద్రాన్ని ఆయన ప్రశంసించారు. దీనివల్ల ఈశాన్యప్రాంతంలో మరింతగా క్రీడలను వృద్ధిచేయవచ్చన్నారు.