విశ్వక్రీడలకు పారిస్ ముస్తాబైంది. మరో ఎనిమిది రోజుల్లో ఒలింపిక్స్ ప్రారంభంకానున్నాయి. పతకాల వేట కోసం భారత్ నుంచి 117 మంది బరిలోకి దిగుతున్నారు. ప్రపంచ వేదికపై భారత్ ఖ్యాతిని మరింత చాటేలా మన క్రీడాకారులు పట్టుదలతో సిద్ధమయ్యారు. అయితే వాళ్లలో తెలుగు క్రీడాకారులు ఎనిమిది ఉండటం విశేషం.
వాళ్లంతా తప్పక పతకాలు సాధిస్తారని తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశమంతా ఆశతో ఉంది. అంతటి గొప్ప ప్లేయర్లుగా వాళ్ల సత్తాచాటుతున్నారు. ప్రత్యర్థిని వణికించేలా తెలుగు తేజాలకు సామర్థ్యం ఉంది. బరిలోకి దిగే రోజు ఒత్తిడిని జయిస్తే చాలు.. పతకాలు సాధించడం వాళ్లకు సులువే. ఆ తెలుగు క్రీడాకారులు ఎవరేంటే...

హ్యాట్రిక్పై కన్నేసిన పీవీ సింధు
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు హ్యాట్రిక్ పతకాలు సాధించాలని కసిగా పారిస్కు పయనమైంది. సింధు రియో ఒలింపిక్స్లో రజతం, టోక్యోలో కంచు మోత మోగించిన విషయం తెలిసిందే. ఈ సారి మెరుగైన ప్రదర్శనతో స్వర్ణం సాధించి హ్యాట్రిక్ మెడల్స్ అందుకోవాలని బరిలోకి దిగుతోంది. అయితే కామన్వెల్త్ క్రీడల్లో గాయపడిన సింధు పునరాగమనం తర్వాత గొప్పగా సత్తాచాటలేకపోతుంది. కానీ పారిస్లో తన విశ్వరూపాన్ని చూపించడానికి సింధు సిద్ధంగా ఉంది.
సంచలన సాత్విక్
సింధుతో పాటు బ్యాడ్మింటన్లో భారత్ మరో పతకంపై ఎన్న ఆశలు పెట్టుకుంది. దానికి కారణం పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి. సాత్విక్ ఏపీలోని ఉమ్మడి తూర్పుగోదావరికి చెందినవాడు. అయితే చిరాగ్తో కలిసి సాత్విక్ ఈ సీజన్లో సంచలనాలు సృష్టించాడు. కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం, వరల్డ్ చాంపియన్షిప్లో కాంస్య పతకం; అంతేగాక ఫ్రెంచ్ ఓపెన్తో తొలి సూపర్-750 సిరీస్ టైటిల్, ఇండోనేసియా ఓపెన్ సూపర్-1000 సిరీస్ను చిరాగ్తో కలిసి నెగ్గాడు. ఈ జోడీ వరల్డ్ నెంబర్వన్ ర్యాంక్ను కూడా దక్కించుకున్నారు.
బాక్సర్ నిఖత్ జరీన్
రెండు సార్లు వరల్డ్ ఛాంపియన్గా నిలిచిన తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ పతక లక్ష్యంగా పారిస్ ఒలింపిక్స్లో బరిలోకి దిగుతోంది. 50 కేజీల విభాగంలో ఆమె పోటీపడుతుంది. నిజామాబాద్కు చెందిన నిఖత్ జరీన్ 2022, 2023 ప్రపంచ ఛాంపియన్షిప్ల్లో స్వర్ణం సాధించి ఔరా అనిపించింది. అంతేగాక కామన్వెల్త్లో బంగారు పతకంతో పాటు ఆసియా క్రీడల్లో బ్రాంజ్ మెడల్ సాధించింది.
టేబుల్ టెన్సిస్
భారత టేబుల్ టెన్నిస్ స్టార్, తెలుగు అమ్మాయి ఆకుల శ్రీజ చరిత్ర పారిస్ ఒలింపిక్స్కు సిద్ధమైంది. ప్రస్తుతం ఈ హైదరాబాద్ అమ్మాయి సూపర్ ఫామ్లో ఉంది. డబ్ల్యూటీటీ కంటెండర్ సింగిల్స్ టైటిల్ సాధించిన తొలి భారత టీటీ ప్లేయర్గా రికార్డు నమోదు చేసింది. అంతేగాక,డబుల్స్ టైటిల్ను కూడా నెగ్గి చరిత్రకెక్కింది. తొలిసారి విశ్వక్రీడలకు క్వాలిఫై అయిన శ్రీజ సింగిల్స్, డబుల్స్ ఈవెంట్స్లో పోటీపడుతుంది. మరో హైదరాబాదీ అమ్మాయి, షూటర్ ఇషా సింగ్ కూడా ఒలింపిక్స్లో పోటీపడుతుంది.
జ్యోతి యర్రాజి
ఏపీలోని విశాఖకు చెందిన యర్రాజి జ్యోతి అథ్లెటిక్స్ 100 మీటర్ల హర్డిల్స్లో బరిలోకి దిగుతోంది. ఒలింపిక్స్లో 100 మీటర్ల హర్డిల్స్లో పోటీపడనున్న మొదటి భారత అథ్లెట్గా ఆమె రికార్డులకెక్కింది. ఇప్పటివరకు ఏ భారత క్రీడారులు సాధించని ఘనతను 24 ఏళ్ల తెలుగు బిడ్డ సాధించింది. వరల్డ్ ర్యాంకింగ్స్ కోటాలో పారిస్ బెర్త్ దక్కించుకుంది. ఇప్పటి వరకు ఆమె ఆసియా, అంతర్జాతీయ పోటీల్లో 10 పతకాలు, రెండు కామన్వెల్త్ పతకాలు, ప్రపంచ విశ్వవిద్యాలయాల పోటీల్లో ఒక పతకం, జాతీయ పోటీల్లో పది పతకాలు సాధించింది.
దండి జ్యోతికశ్రీ
ఏపీ నుంచి మరో అథ్లెట్ విశ్వక్రీడలకు ఎంపికైంది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన దండి జ్యోతికశ్రీ అథ్లెటిక్స్ 4x400 రిలే ఈవెంట్లో భారత్కు ప్రాతినిథ్యం వహించనుంది. సూపర్ ఫామ్లో ఉన్న జ్యోతికశ్రీ రెండు అంతర్జాతీయ పతకాలు, ఆరు జాతీయ పతకాలు సాధించింది.
బొమ్మదేవర ధీరజ్
పారిస్ ఒలింపిక్స్లో 22 ఏళ్ల తెలుగు ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ కూడా పాల్గొంటున్నాడు. విజయవాడకు చెందిన ధీరజ్ గతేడాది ఆసియా క్వాలిఫయర్స్లో సత్తాచాటి ఒలింపిక్స్ బెర్తు పట్టేశాడు. ఆర్చరీలో పారిస్ ఒలింపిక్స్ బెర్తు దక్కించుకున్న తొలి భారత ఆర్చర్ అతనే. గత కొంతకాలంగా అతను నిలకడగా రాణిస్తున్నాడు. ఆర్చరీలో దేశానికి తొలి పతకం అందించడానికి కసిగా బరిలోకి దిగుతున్నాడు.