
హైదరాబాద్: ప్యాంగ్ చాంగ్ వేదికగా జరుగుతోన్న శీతాకాల ఒలింపిక్స్ సందర్భంగా ఉభయ కొరియా దేశాలు చేరువైయ్యాయి. అంతేకాదు సుదీర్ఘ కాల విరామం తర్వాత కలిసినందుకు గాను దక్షిణకొరియా అతిథి మర్యాదలకు లోటు లేకుండా చూసుకుంది. స్నేహం బలపడటంతో 2021 ఆసియన్ వింటర్ గేమ్స్ సందర్భంగా నిర్వహించే వేలంలో ఇరు దేశాలు కలిసి పాల్గొనాలని భావిస్తున్నాయి.
ఈ క్రీడల నిమిత్తం ఇంకా వేదిక ఖరారు కాకపోవడంతో ఈ ఉభయ దేశాలు తాము సిద్ధంగానే ఉన్నామంటూ ముందుకొస్తున్నాయి. 2017 సంవత్సరానికి గాను ఆసియన్ వింటర్ గేమ్స్ జపాన్ దేశంలో సప్పొరొ ప్రాంతంలో 2017 ఫిబ్రవరి 19 నుంచి 26 వరకు జరిగాయి.
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధికార ప్రతినిధి అయిన ఛాంగ్ ఉంగ్ ఈ సందర్భంగా మాట్లాడారు. 'ఉత్తర, దక్షిణ కొరియా దేశాలు కలిసి శీతాకాల ఆసియన్ క్రీడలకు వేదికైతే బాగుంటుందా అనే కోణంలో పరిశీలిస్తున్నాం. త్వరలోనే అందుకు తగ్గ నిర్ణయం తీసుకుని ప్రకటిస్తాం' అని వివరించారు.
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్ థామస్ బాచ్ మాట్లాడుతూ ఫిబ్రవరి 25వరకు జరగనున్న శీతాకాల ఒలింపిక్ క్రీడలకు దక్షిణకొరియా చక్కని ఆతిథ్యాన్ని అందించని అభిప్రాయపడ్డారు. ఈ ఒలింపిక్స్ ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పుతాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.