
మాస్కో: భారత మహిళా చెస్ క్రీడాకారిణి, గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి ప్రతిష్టాత్మక ప్రపంచ మహిళల ర్యాపిడ్ చెస్ చాంపియన్షిప్లో విశ్వవిజేతగా అవతరించింది. శనివారం ముగిసిన ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్షిప్లో హంపి మహిళల విభాగంలో స్వర్ణం పతకం సాధించింది. దీంతో విశ్వవిజేతగా నిలిచిన తొలి భారతీయ చెస్ క్రీడాకారిణిగా కొత్త చరిత్ర సృష్టించింది.
మొత్తం 12 రౌండ్లుగా జరిగిన ఈ మెగా టోర్నీలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ హంపీ 9 పాయింట్లు ఖాతాలో వేసుకొని చాంపియన్గా అవతరించింది. 12 రౌండ్ల తర్వాత హంపి, లీ టింగ్జి (చైనా), అతాలిక్ ఎకతెరీనా (టర్కీ) 9 పాయింట్లతో సంయుక్తంగా అగ్ర స్థానంలో నిలిచారు. మెరుగైన 'టై' బ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్ను ప్రకటించగా.. హంపి, లీ టింగ్జి తొలి రెండు స్థానాల్లో నిలిచారు. అతాలిక్ మూడో స్థానంలో నిలిచి కాంస్యంతో సరిపెట్టుకుంది.
హంపి, లీ టింగ్జి మధ్య ప్రపంచ చాంపియన్ను నిర్ణయించేందుకు మొదటగా రెండు బ్లిట్జ్ గేమ్లు నిర్వహించారు. తొలి బ్లిట్జ్ గేమ్లో తెల్లపావులతో ఆడిన హంపి 29 ఎత్తుల్లో ఓడిపోయింది. ఇక రెండో బ్లిట్జ్ గేమ్లో నల్లపావులతో ఆడిన హంపి 45 ఎత్తుల్లో విజయాన్ని అందుకుంది. టై బ్రేక్లోనూ ఇద్దరు 1-1తో సమంగా నిలవడంతో విజేతను నిర్ణయించేందుకు 'అర్మగెడాన్ గేమ్'ను నిర్వహించారు.
అర్మగెడాన్ నిబంధన ప్రకారం.. గేమ్లో తెల్ల పావులతో ఆడిన వారు తప్పకుండా గెలవాలి. ఒకవేళ 'డ్రా' అయితే నల్ల పావులతో ఆడిన వారిని విజేతగా ప్రకటిస్తారు. ఈ అర్మగెడాన్ గేమ్లో హంపి 66 ఎత్తుల్లో గేమ్ను 'డ్రా' చేసుకోవడంతో.. ప్రపంచ చాంపియన్గా ఆవిర్భవించింది. తెల్ల పావులతో ఆడిన లీ టింగ్జి రన్నరప్గా నిలిచి రజత పతకంను సొంతం చేసుకుంది.
భారత్ తరఫున ర్యాపిడ్ విభాగంలో ప్రపంచ చాంపియన్గా నిలిచిన రెండో ప్లేయర్ హంపి. 2017లో విశ్వనాథన్ ఆనంద్ ఓపెన్ విభాగంలో విశ్వవిజేతగా నిలిచాడు. ఆంధ్రప్రదేశ్కే చెందిన మరో గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక 8 పాయింట్లతో 13వ స్థానంలో నిలిచింది. ఓపెన్ విభాగంలో మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) విశ్వవిజేతగా నిలిచాడు.