విజయవాడ: పాప పుట్టిన రోజే సంవత్సరం తర్వాత తిరిగి చెస్ ఆడాలని నిర్ణయించుకున్నా. అదే విధంగా చేశా. అమ్మగా మారిన తర్వాత కూడా బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్, టెన్నిస్ తార సెరెనా విలియమ్స్ ఆటలో సత్తా చాటి టైటిల్స్ సాధించారు. వారే నాకు స్ఫూర్తి కలిగించారు అని భారత చెస్ నంబర్వన్ క్రీడాకారిణి, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. ఇటీవలే హంపి ప్రతిష్టాత్మక ప్రపంచ మహిళల ర్యాపిడ్ చెస్ చాంపియన్షిప్లో విశ్వవిజేతగా అవతరించిన విషయం తెలిసిందే. దీంతో విశ్వవిజేతగా నిలిచిన తొలి భారతీయ చెస్ క్రీడాకారిణిగా కొత్త చరిత్ర సృష్టించింది.
అప్పుడు వేలంలో అన్సోల్డ్ ప్లేయర్.. ఇప్పుడు రాజస్తాన్ స్పిన్ కన్సల్టెంట్గా బాధ్యతలు!!
ఇటీవలి విజయం విశేషాలలపై హంపి మాట్లాడుతూ... 'అమ్మగా మారిన తర్వాత కూడా మేరీ కోమ్, సెరెనాలు వారి వారి క్రీడాంశాల్లో రాణిస్తున్నారు. వారిలా నేను కూడా బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత తనకిష్టమైన రంగంలో పునరాగమనం చేయాలని అనుకున్నా. నా పునరాగమనం కోసం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేదాన్ని. అందుకోసం ప్రణాళికను కూడా సిద్ధం చేసుకున్నా. పాప పుట్టిన రోజే సంవత్సరం తర్వాత తిరిగి చెస్ ఆడాలని నిర్ణయించుకున్నా. అదే విధంగా చేశా' అని తెలిపింది.
'ప్రపంచ చాంపియన్ అనే బిరుదు ఇంత త్వరగా లభిస్తుందని కలలో కూడా ఊహించలేదు. ఇందులో నా కుటుంబం పాత్ర ఎంతో ఉంది. చాలా సంతోషంగా ఉంది. గోల్డ్ మెడల్ సాధించడం నా 15 ఏళ్ల కల. ప్రత్యర్థులతో ఎత్తుకు పైఎత్తు వేసి మేధస్సుకు పని చెప్పా. గోల్డ్ మెడల్ ఇస్తున్న సమయంలో జాతీయ గీతం వినగానే చాలా ఆనందం వేసింది' అని హంపి పేర్కొంది.
తాజాగా ముగిసిన ప్రపంచ బ్లిట్జ్ చెస్ చాంపియన్షిప్లో హంపి నిర్ణీత 17 రౌండ్లలో 10.5 పాయింట్లు ఖాతాలో వేసుకొని 12వ స్థానంలో నిలిచింది. ఇక మహిళల ర్యాపిడ్ చెస్ చాంపియన్షిప్లో మొత్తం 12 రౌండ్లలలో 9 పాయింట్లు ఖాతాలో వేసుకొని హంపీ చాంపియన్గా అవతరించింది. ఓవరాల్గా 2019 ఏడాది హంపికి ఘనంగా గడిచింది. క్లాసికల్ విభాగంలో 30 రేటింగ్ పాయింట్లు, ర్యాపిడ్ విభాగంలో 45 రేటింగ్ పాయింట్లను సాధించింది.