ఖోఖో ప్రపంచ కప్ తొలి ఎడిషన్ లోనే ఆతిథ్య భారత్ అదరి ప్రదర్శన చేస్తోంది. గ్రామీణ క్రీడల్లో తమకు తిరుగులేదని నిరూపిస్తూ... ఈ మెగాటోర్నీలో భారత పురుషుల, మహిళల జట్లు ఫైనల్ కు దూసుకెళ్లాయి. టైటిల్ ను ముద్దాడేందుకు అడుగు దూరంలో నిలిచాయి.
ఈ ఖోఖో వరల్డ్ కప్ లో భాగంగా తాజాగా జరిగిన వేర్వేరు సెమీ ఫైనల్ మ్యాచుల్లో భారత మెన్స్, ఉమెన్స్ టీమ్ అదిరే ప్రదర్శన చేశాయి. ఆఖరి వరకు హోరా హోరీగా, ఆసక్తికరంగా సాగిన ఈ పోరులో మన ప్లేయర్లు అద్భుతంగా ఆడారు. పురుషుల సెమీస్లో భారత్ జట్టు 62-42తో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. భారత అమ్మాయిల జట్టు 66-16తో సౌతాఫ్రికాను చిత్తు చేసింది.

పురుషుల విభాగం సెమీస్లో భారత జట్టు ఒక దశలో 28-42తో వెనుకబడింది. అయినా ఆ తర్వాత గొప్పగా పుంజుకుని విజయాన్ని దక్కించుకుంది. ఇంకో సెమీస్లో నేపాల్ 72-20తో ఇరాన్పై గెలిచింది. దీంతో ఫైనల్లో నేపాల్తో భారత్ తలపడనుంది.
మహిళల విభాగం సెమీస్ లో భారత జట్టు ఆరంభం నుంచి దూకుడుగా ఆడి 38-16తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత కూడా అదే జోరును కొనసాగించి ఘన విజయాన్ని ఖాతాలో వేసుకుంది. జట్టు విజయంలో నిర్మలా భాటి, నాజియా, వైష్ణవి, నస్రీన్ షేక్, బిలార్ దేవి కీలకంగా వ్యవహరించారు. మరో సెమీస్లో నేపాల్ 89-18 తేడాతో ఉగాండాను చిత్తు చేసింది. దీంతో తుది పోరులో నేపాల్తో భారత్ ఢీ కొట్టబోతుంది.