ఖోఖో ప్రపంచకప్ తొలి ఎడిషన్ లో భారత అమ్మాయిల జట్టు చరిత్ర సృష్టించింది. తద్వారా తొలి ఖోఖో ప్రపంచకప్ ఛాంపియన్గా అవతరించింది. 23 దేశాలు పాల్గొన్న ఈ మెగా టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత జట్టు అజేయంగా టోర్నీని ముగించింది.
దిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియం వేదికగా జరిగిన ఈ ఖోఖో వరల్డ్ కప్ ఫైనల్ లో భారత మహిళల జట్టు 78-40 తేడాతో నేపాల్ను ఓడించింది. ఈ తుది పోరు టర్న్ 1లో భారత్ దూకుడు ప్రదర్శనను కనబరిచింది. దీంతో 34-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. ఆ తర్వాత రెండో టర్న్లో నేపాల్ పుంజుకోవడం వల్ల 35-24తో ముగిసింది. ఇక మూడో టర్న్లో భారత్ మళ్లీ దూకుడు ప్రదర్శించడం వల్ల, వరుసగా పాయింట్లు సాధించి ఆధిక్యంలోకి (49) దూసుకెళ్లింది. చివరి టర్న్లో నేపాల్ 16 పాయింట్లు సాధించడం వల్ల, భారత్ 38 పాయింట్లతో అద్భుత విజయాన్ని అందుకుని ఛాంపియన్ గా అవతరించింది.
