హైదరాబాద్: స్పాన్సర్లు ఆర్థిక చేయూత ఇవ్వడం వల్ల భారత క్రీడా రంగం ఎంతో అభివృద్ధి సాధించిందని దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ పేర్కొంది. తన కెరీర్ ఆరంభ రోజుల్లో ఓ జత గ్లోవ్స్ కొనేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డానని తెలిపింది. శుక్రవారం నుంచి గువహటి వేదికగా ఖేలో ఇండియా ఆటల పోటీల ప్రారంభం కానున్నాయి.
ఈ నేపథ్యంలో మేరీ కోమ్ మాట్లాడుతూ "నా కెరీర్ ఆరంభ రోజుల్లో ఓ జత గ్లోవ్స్ కొనేందుకు డబ్బుల్లేక చాలా ఇబ్బంది పడ్డా. కానీ ప్రస్తుతం దేశ క్రీడా రంగం ఎంతో పురోగమించింది. ప్రస్తుతం ఆటగాళ్లకు స్పాన్సర్లు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. భారత క్రీడా రంగం చాలా దూరం ప్రయాణించింది" అని తెలిపింది.
'ఐసీసీది తెలివి తక్కువ నిర్ణయం.. టెస్టు క్రికెట్లో మార్పులేమీ చేయొద్దు'
"ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న క్రీడాకారులు పోటీలలో పాల్గొనేందుకు విమానంలో వెళుతుండడం వారికి ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది" అని మేరీ కోమ్ పేర్కొంది. ఖేలో ఇండియా క్రీడల్లో పాల్గొనే అథ్లెట్లకు ప్రపంచ స్థాయి అనుభవం కల్పించేందుకు స్పైస్జెట్తో ఒప్పందం చేసుకున్న భారత క్రీడా ప్రాధికార సంస్థ 1000 మందికి విమాన ప్రయాణాన్ని కల్పిస్తోంది.
శుక్రవారం గువహటిలో ప్రారంభమయ్యే ఖేలో ఇండియా పోటీల్లో పాల్గొనే అథ్లెట్లు బుధవారం విమానంలో బయలుదేరారు. వారికి మేరీ కోమ్ వీడ్కోలు పలికింది. ఖేలో ఇండియా మూడో సీజన్ ఆరంభోత్సవాన్ని స్థానిక ఇందిరాగాంధీ స్టేడియంలో అట్టహాసంగా నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు.
భారత్తో సిరీస్.. న్యూజిలాండ్కు భారీ ఎదురుదెబ్బ!!
ఈ ప్రారంభ వేడుకలకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, అసోం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ హాజరుకానున్నారు. 37 రాష్ట్రాలకు చెందిన 6,800 మంది అథ్లెట్లు 20 క్రీడా విభాగాల్లో పతకాల కోసం పోటీపడనున్నారు.