9.55 సెకన్లలోనే 100మీ:
తాజాగా శ్రీనివాస గౌడ 100మీ పరుగుని 9.55 సెకన్లలో అందులోనూ బురద నీటిలో పూర్తి చేసి ప్రపంచ దృష్టిని ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్నాడు. బోల్ట్ కంటే 3 సెకన్ల ముందే 100 మీ పరుగుని శ్రీనివాస్ పూర్తి చేశాడు. గౌడ రేస్లో పోటీపడుతున్న వీడియో ట్విట్టర్లో ఒకరు పోస్ట్ చేసి 'బోల్ట్ రికార్డు బద్దలు' అని రాసుకొచ్చాడు. ఆ వీడియో నిమిషాల్లోనే వైరల్గా మారిపోయింది. దీంతో గౌడని ఇప్పుడు అందరూ 'భారత్ ఉసేన్ బోల్ట్' అని పిలుస్తున్నారు.
కిరణ్ రిజిజు చొరవ:
శ్రీనివాస గౌడ 100మీ పరుగుని 9.55 సెకన్లలో పూర్తి చేయడంతో సోషల్ మీడియాలో అతనిపై ప్రశంసల వర్షం కురిసింది. ఇక సోషల్ మీడియా పుణ్యమా అని ఈ విషయం కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజుకు చేరింది. గౌడకు మెరుగైన శిక్షణ ఇచ్చి ఒలింపిక్స్కి పంపించాలని చాలా మంది ఆయనకు సూచించారు. మంత్రి స్వయంగా స్పందించి గౌడకు ఓసారి ట్రయల్స్ నిర్వహించాల్సిందిగా శాయ్ అధికారుల్ని ఆదేశించారు.
ట్రయల్స్లో పాల్గొనను:
ఈ రోజు శ్రీనివాస గౌడ శాయ్ ట్రయల్స్కు హాజరు కావాల్సి ఉంది. అయితే ట్రయల్స్ మీద తనకు ఆసక్తి లేదని, కంబాలపై దృష్టి సారిస్తానని ఆయన తెలిపారని సమాచారం తెలుస్తోంది. సోమవారం ఓ మీడియాతో మాట్లాడిన గౌడ... 'కంబాల రేసులో నా కాలి మడమ సాయంతో వేగంగా పరుగెత్తగలను. ట్రయల్స్లో సింథటిక్ ట్రాక్పై షూస్తో పరుగెత్తడం చాలా కష్టం. కంబాల రేసులో జాకీకి దున్నల నుంచి సపోర్ట్ లభిస్తుంది. ట్రాక్పై ఎటువంటి సపోర్ట్ ఉండదు. నేను ట్రయల్స్లో పాల్గొనను. కంబాలపైనే దృష్టి సారిస్తాను' అని చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
బురద పొలంలో మాత్రమే పరుగెత్తుతా:
సోషల్ మీడియాలో ఉసేన్ బోల్ట్తో పోలికలు వస్తుండడంతో శ్రీనివాస గౌడ స్పందించారు. 'దేశంలోని ప్రజలు నన్ను ఉసేన్ బోల్ట్తో పోలుస్తున్నారు. అతను ఓ ప్రపంచ ఛాంపియన్. నేను కేవలం బురద పొలంలో మాత్రమే పరుగెత్తుతాను' అని కంబాల జాకీ తెలిపారు.
దక్షిణ కన్నడకు చెందిన సాంప్రదాయ కంబాల పోటీదారు 28 ఏళ్ల శ్రీనివాస గౌడ 142.5 మీటర్ల దూరాన్ని కేవలం 13.62 సెకన్లలోనే పూర్తి చేశారు. అంటే.. గౌడ 100 మీటర్ల దూరాన్ని కేవలం 9.55 సెకన్లలోనే అందుకున్నారు. 9.55 సెకన్లలోనే 100 మీటర్లు పరుగెత్తడం అంటే.. ప్రపంచ ఛాంపియన్ బోల్ట్ అత్యుత్తమ ప్రదర్శన కంటే గొప్పది.