
టోక్యో: టోక్యో: జపాన్ వేదికగా సాగుతోన్న ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్లో తొమ్మిదో రోజు భారత్ మిశ్రమ ఫలితాలను సాధించింది. పురుషుల లైట్ వెయిట్ బాక్సింగ్లో నాకౌట్ రౌండ్లోనే వెనుదిరిగింది. పురుషుల అర్చరీ 1/8 ఎలిమినేషన్ రౌండ్లో భారత స్టార్ అర్చర్ అతాను దాస్ వెనుదిరిగాడు. పతకానికి అతి చేరువగా వెళ్లిన దాస్.. లోకల్ హీరో టకహరు ఫుకరువాను అధిగమించలేకపోయాడు. ఎలిమినేషన్ రౌండ్లో తిరుగుముఖం పట్టాడు. ఈ రెండు పరాజయాలను మరిపించేలా చేశారు అథ్లెట్ కమల్ ప్రీత్ కౌర్. స్ఫూర్తిదాయక విజయాన్ని అందుకున్నారు. వెటరన్ సీమా పునియా కూడా ఫైనల్స్కు చేరువయ్యారు. గ్రూప్ ఏ క్వాలిఫికేషన్స్లో ఆరో స్థానంలో నిలిచారు.
మహిళల డిస్కస్ థ్రో కేటగిరీలో ఫైనల్స్కు అర్హత సాధించారు. అత్యంత క్లిష్టమైన రౌండ్లల్లో ఒకటిగా గుర్తింపు ఉన్న డిస్కస్ థ్రో కేటగిరీలో కమల్ప్రీత్ అద్భుతాన్ని ఆవిష్కరించారు. భారత కాలమానం ప్రకారం.. ఈ ఉదయం 7:15 నిమిషాలకు ఒలింపిక్స్ స్టేడియంలో మహిళల డిస్కస్ థ్రో గ్రూప్ బీ క్వాలిఫికేషన్స్ రౌండ్ ఆరంభమైంది. తొలి ప్రయత్నంలో కమల్ప్రీత్ కౌర్ 60.29 మీటర్ల దూరం పాటు డిస్కస్ను విసిరారు. ఇది ఆమెను గ్రూప్ బీ క్వాలిఫికేషన్స్ రౌండ్లో ఏడో స్థానంలో నిలిపింది. పోటీ తీవ్రం కావడంతో క్రమంగా ఆమె స్థానం 10కి దిగజారింది.
రెండో అటెంప్ట్లో విజృంభించారు.. కమల్ ప్రీత్. రెండో ప్రయత్నంలో ఎదురు లేకుండా పోయింది. ఈ అటెంప్ట్లో డిస్కస్ను 63.97 మీటర్ల దూరం వరకు విసిరారు. దీన్ని తోటి అథ్లెట్లు అందుకోలేకపోయారు. ఫలితంగా రెండో స్థానానికి ఎగబాకారు. అప్పటికే ఆమెకు పోటీ లేకుండా పోయింది. మూడో అటెంప్ట్లో కమల్ ప్రీత్ విసిరిన డిస్కస్.. మరింత దూరం వెళ్లింది. ఈ సారి ఆమె 64 మీటర్ల దూరానికి డిస్కస్ను విసిరారు. దీనితో ఆటోమేటిక్గా ఫైనల్స్కు అర్హత సాధించారు. ఫైనల్స్లో తొలి ముగ్గురిలో గనక ఆమె నిలవగలిగితే భారత్కు ముచ్చటగా మూడో పతకం లభించడం ఖాయమౌతుంది.