హైదరాబాద్: పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ తో పెళ్లి విషయంలో తన కూతురు కోరుకున్నట్లే జరిగిందని అయేషా సిద్దిఖి తండ్రి అన్నారు. రసూల్ ఖాన్ నివాసంలో అయేషా తల్లిదండ్రులు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. షరతులు ఏవీ లేకుండా విడాకులకు తాము అంగీకరించినట్లు అయేషా తండ్రి తెలిపారు. ఇస్లాం చట్ట ప్రకారం నిర్వహణకు మూడు నెలల భరణం, నెలకు ఐదు వేల చొప్పున 15 వేల రూపాయలు షోయబ్ ఇచ్చాడని, అందుకు తాము అంగీకరించామని ఆయన చెప్పారు. తాము డబ్బులేమీ అడగలేదని ఆయన అన్నారు. పెళ్లి చేసుకున్నాడు కాబట్టి బహిరంగంగా విడాకులివ్వాలని తమ కూతురు కోరుతూ వస్తోందని ఆయన చెప్పారు. షోయబ్ విడాకులు ఇవ్వడంతో తమకు న్యాయం జరిగిందనే భావిస్తున్నామని అయేషా తల్లి చెప్పింది. తమకు వ్యవహారం సంతృప్తినిచ్చిందని ఆయన చెప్పారు. 15 మంది మధ్యవర్తుల సమక్షంలో రాజీ కుదిరిందని అయేషా తల్లిదండ్రులు చెప్పారు. ఖాజీల సమక్షంలో షోయబ్ తో రాజీ కుదిరినట్లు వారు తెలిపారు. మొదటి నుంచి తమ కూతురు డబ్బులు అడగడం లేదని, బహిరంగ విడాకులు మాత్రమే కోరుతోందని, అది జరిగిందని వారన్నారు.