
హైదరాబాద్: వాడకపోయినా గదిలో నిషేదిత ఉత్ప్రేరకాలు ఉన్నాయంటూ భారత జావెలిన్ త్రో ఆటగాడు దావీందర్ సింగ్ కాంగ్పై అనుమానంతో అతనిని అదుపులోకి తీసుకున్నారు. కాంగ్ నుంచి శాంపిల్స్ సేకరించిన అథ్లెటిక్స్ సమాఖ్య సంఘం(ఏఐయూ) వాటిల్లో ఎనబోలిక్ స్టిరియాడ్ ఉత్ప్రేరకం ఉన్నట్లు గుర్తించింది. దీంతో అతనిపై నాలుగేళ్ల పాటు ఎలాంటి టోర్నీల్లో పాల్గొనకూడదంటూ నిషేదాజ్ఞలు జారీ అయ్యాయి.
29ఏళ్ల కాంగ్ ఇప్పుటి నుంచి ఎలాంటి టోర్నీలలో పాల్గొనేందుకు వీలులేకపోవడంతో దాదాపు అతని కెరీర్ ముగిసినట్లేనని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు వాడా (వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ) నిబంధనలకు విరుద్ధంగా నిషేధిత ఉత్ప్రేరకాల వినియోగించి, డోపింగ్ పరీక్షల్లో విఫలం కావడంతో కాంగ్ను భారత అథ్లెటిక్స్ సమాఖ్య ఈ ఏడాది పాటియాలాలో జరగనున్న పోటీలలో జావెలిన్ త్రో విభాగం నుంచి అతని పేరును తొలగించింది. అదేవిధంగా ఈ ఏడాది జరగనున్న కామన్వెల్త్ క్రీడల్లోనూ పాల్గొనే అవకాశం లేకుండా పోయింది.
గతేడాది ఢిల్లీలో మే నెలలో జరిగిన ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్ ఈవెంట్లోనూ జాతీయ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(నాడా) ఈ పంజాబీ ఆటగాడి నుంచి శాంపిల్స్ సేకరించింది. ఆ డోపింగ్ పరీక్షల్లోనూ కాంగ్ గంజాయి వినియోగించినట్లు గుర్తించారు. కానీ, గంజాయి వాడా గుర్తించిన నిషేధిత ఉత్ప్రేరకాలు జాబితాలో లేకపోవడం వలన కాంగ్పై అప్పుడు ఎలాంటి నిషేధం విధించలేదు.
కాంగ్ 2017 లండన్లో జరిగిన ప్రపంచ ఛాంపియన్ షిప్లో భారత్ తరఫున పాల్గొని జావెలిన్ త్రో లో ఫైనల్ వరకూ చేరుకున్న తొలి భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు. 'అతను నిషేదాన్ని ఎత్తి వేయాలంటూ అప్పీలు చేయదలిస్తే ఐఏఏఎఫ్ను సంప్రదించాలి. ఏదైనా నిరూపించదలిస్తే ఏఐయూ ముందు హాజరు కావాల్సి ఉంది' అని ఐఏఏఎఫ్ అధికారి ఒకరు వెల్లడించారు.