
హైదరాబాద్: భారత్ క్రీడల తీరు మారుతోంది. ఇటీవలే ఫిన్లాండ్ వేదికగా హిమదాస్.. 400మీ పరుగు పందెంలో అందరికంటే ముందు రాణించి స్వర్ణం సంపాదించింది. అతి కొద్ది రోజుల వ్యవధిలో.. ఫ్రాన్స్లో జరుగుతున్న సొట్టేవిల్లే అథ్లెటిక్స్ మీట్లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పసిడి పతకాన్ని గెలుపొందాడు.
ఈ ఏడాది ఆస్ట్రేలియాలోని గోల్డ్కోస్ట్లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో భారత్కి స్వర్ణ పతకాన్ని అందించిన ఈ స్టార్ అథ్లెట్.. తాజాగా ఫ్రాన్స్లో జరిగిన అథ్లెటిక్స్ మీట్ ఫైనల్లో జావెలిన్ను రికార్డు స్థాయిలో (85.17 మీటర్లు) విసిరి స్వర్ణాన్ని చేజిక్కించుకున్నాడు. ఛాంపియన్ చోప్రా తర్వాత స్థానంలో మోల్దోవన్ జావెలిన్ త్రోయర్ ఆండ్రియన్ (81.48 మీటర్లతో) రజత పతకాన్ని గెలుపొందగా.. లితివేనియా అథ్లెట్ ఈడిస్ (79.31 మీటర్లతో) కాంస్య పతకం గెలుపొందారు.
గతంలో ఇంతకంటే మెరుగ్గా:
మరో ఆటగాడైన 2012 ఒలింపిక్ ఛాంపియన్ వాల్కాట్ 78.26 మీటర్లు మాత్రమే జావెలిన్ను విసిరి ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 2016లో జరిగిన వరల్డ్ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో నీరజ్ చోప్రా జావెలిన్ను 86.48 మీటర్లు విసిరి ప్రపంచ రికార్డు నెలకొల్పినా.. మరొకసారి ఆ రికార్డును బ్రేక్ చేయలేకపోతున్నాడు. ఈ ఏడాది ముగిసిన కామన్వెల్త్ గేమ్స్లో 86.47 మీటర్లతో ఆ రికార్డు దరిదాపుల్లోకి వచ్చినా.. తాజాగా 85.17 మీటర్లే జావెలిన్ను చోప్రా విసరడం కొసమెరుపు.
2016లో కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినప్పటికీ రియో ఒలింపిక్స్కి అర్హత సాధించలేకపోయిన ఈ స్టార్ జావెలిన్ త్రోయర్.. త్వరలోనే ఇండోనేషియా వేదికగా జరగనున్న ఆసియా గేమ్స్లో భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించనున్నాడు.