ఒలింపిక్ నిబంధనలు కొందరు అథ్లెట్లకు శాపంగా మారుతున్నాయి. కేవలం 100 గ్రాములు ఎక్కువగా ఉందని భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్ ఫైనల్ కు ముందు డిస్ క్వాలిఫై చేశారు. అయితే పారిస్ ఒలింపిక్స్ 2024 నుంచి అనర్హత వేటును ఎదుర్కొన్న ఏకైక అథ్లెట్ వినేష్ ఫోగటే కాకుండా మరో రెజ్లర్ కూడా ఉన్నారు. ఇటలీకి చెందిన ఇమాన్యులా లియుజ్జీ కూడా ఫోగాట్ లాగానే 50 కేజీలకు పైగా ఉండడంతో మహిళల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఫైనల్స్లో పాల్గొనడానికి ఆమెను అనుమతించలేదు.
ఉత్తర కొరియాకు చెందిన కిమ్ సోన్హ్యాంగ్ వైదొలిగిన తర్వాత, కాంపానియాకు చెందిన 24 ఏళ్ల ఆమె 10 రోజుల క్రితం గేమ్స్కు చివరి నిమిషంలో స్థానం సంపాదించింది. 16వ రౌండ్లో ఆమె ఒలింపిక్ అరంగేట్రం చేయవలసి ఉంది. కానీ ఎక్కువ బరువు ఉండడంతో వైదొలగవలసి వచ్చింది.
వినేష్ ఫోగట్ అదే విధిని ఎదుర్కొంది, అయితే ఆమె 100 గ్రాముల అధిక బరువుతో బంగారు పతక పోటీలో పాల్గొనలేకపోయింది.

ఫోగాట్ బరువు తగ్గించుకోవడానికి తన వంతు ప్రయత్నం చేసింది. తెల్లవారుజాము వరకు రాత్రంతా పని చేసింది. కానీ అప్పటికీ బరువు తగ్గలేక పోయింది. డీహైడ్రేషన్ కారణంగా ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఆ తర్వాత గురువారం రెజ్లింగ్కు రిటైర్మెంట్ ప్రకటించింది. వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు వేసిన విషయం అడ్హక్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్కు చేరింది. అనర్హత వేటుపై ఈ రోజు వాదనలను ఈ న్యాయస్థానం విననుంది.
భారత ఒలింపిక్స్ అసోసియేషన్ తరఫున సీనియర్ అడ్వొకేట్, మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే వాదించనున్నారు. అంతర్జాతీయ స్థాయి ఆర్బిట్రేషన్లు, హై ప్రొఫైల్ కేసులను వాదించడంలో హరీష్ సాల్వేకు అనుభవం ఉంది.