
2026లో జరగనున్న వింటర్ ఒలింపిక్స్, పారాలింపిక్స్కు ఇటలీ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ సోమవారం అధికారికంగా ప్రకటించారు. ఐఓసీ సభ్యుల సమావేశం స్వీడన్లోని స్టాక్హోమ్లో జరిగింది. 2026 వింటర్ ఒలింపిక్స్ అతిథ్యం కోసం ఇటలీ, స్వీడన్ బిడ్ దాఖలు చేయగా.. ఎక్కువ మంది ఐఓసీ సభ్యులు ఇటలీకే ఓటేశారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఫిబ్రవరి 6 నుంచి 22 వరకు వింటర్ ఒలింపిక్స్, మార్చి 6 నుంచి 15 వరకు వింటర్ పారాలింపిక్స్ జరగనున్నాయి. ఇటలీలోని మిలానో, కార్టినా నగరాల్లో వీటిని నిర్వహించనున్నారు. మిలానో-కార్టినాలకు 47 ఓట్లు రాగా.. స్టాక్హోమ్కు 34 ఓట్లు వచ్చాయి. ఒక ఓటు మాత్రం రెండిటికీ వ్యతిరేకంగా వచ్చింది. ఇప్పటివరకు ఇటలీ రెండుసార్లు 1956, 2006లో వింటర్ ఒలింపిక్స్ను నిర్వహించింది. 2026లో ఇటలీ మళ్లీ ఆతిథ్యం ఇవ్వబోతోంది.
లాట్వియన్ నగరంలోని సిగుల్డాలో కొన్ని ఆటలను నిర్వహించాలని స్టాక్హోమ్ సమర్పించిన బిడ్లో ఉంది. మొదటిసారి వింటర్ ఒలింపిక్స్ గేమ్స్ బిడ్ గెలవాలని ఆశించిన స్వీడన్కు నిరాశే ఎదురైంది. 'బిడ్ ఇటలీకి లభించింది. వింటర్ ఒలింపిక్స్ కోసం ఎదురుచూస్తున్నాం. ఇటలీ ప్రపంచంలోని ఉత్తమ అథ్లెట్లకు సరైన వాతావరణాన్ని అందిస్తుందనే నమ్మకం ఉంది' అని ఐఓసి అధ్యక్షుడు థామస్ బాచ్ పేర్కొన్నారు.