
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్ టోర్నీలో కరోనా మహమ్మారి కలకలం సృష్టించింది. ముగ్గురు అథ్లెట్లకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎన్ఆర్ఐఏ) ప్రతినిధులు ఈ విషయాన్ని శనివారం ధ్రువీకరించారు. ప్రస్తుతం ఆ ముగ్గురూ తమ హోటల్ గదులకే పరిమితమయ్యారని చెప్పారు. వారి ఆరోగ్యం నిలకడగానే ఉంది.
వైరస్ బారినపడ్డ షూటర్లతో ఆయా గదుల్లో ఉన్న మరో ముగ్గురు క్రీడాకారులు సైతం పరీక్షలు చేయించుకున్నారని ఎన్ఆర్ఏఐ వర్గాలు తెలిపాయి. అయితే వారి ఫలితాలు రావాల్సి ఉండగా.. ముందస్తుగా సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నట్లు పేర్కొన్నారు. ముగ్గురు షూటర్లలో ఇద్దరు భారత క్రీడాకారులేనని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే నలుగురు వైరస్ బారినపడగా.. గురువారం మరో విదేశీ ఆటగాడు కొవిడ్ పాజిటివ్గా పరీక్షించడంతో.. హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు.
ఈ ప్రపంచకప్లో భారత షూటర్లు దివ్యాంశ్ సింగ్ పన్వర్, అర్జున్ బబుతా సత్తాచాటారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్రైఫిల్ విభాగంలో ఈ ఇద్దరూ ఫైనల్లో చోటు సంపాదించారు. శుక్రవారం జరిగిన 60 షాట్ల క్వాలిఫికేషన్ రౌండ్లో అర్జున్ (631.8 పాయింట్లు) మూడో స్థానం, పన్వర్ (629.1 పాయింట్లు) ఆరో స్థానంలో నిలిచి తుది పోరుకు అర్హత సాధించారు. అయితే మరో భారత షూటర్ దీపక్ కుమార్ (626.4 పాయింట్లు) మాత్రం క్వాలిఫయి కాలేదు.
2019 ఏప్రిల్లో బీజింగ్లో జరిగిన ప్రపంచకప్లో 10 మీటర్ల ఎయిర్రైఫిల్లో రజతం గెలిచిన దివ్యాంశ్ పన్వర్.. టోక్యో ఒలింపిక్స్ బెర్తు కూడా సాధించాడు. మరోవైపు మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో అంజుం మౌద్గిల్ ఫైనల్ చేరింది. అర్హత పోటీలో 629.6 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన అంజుం ముందంజ వేసింది.