
ఆరంభం నుంచి ఆధిపత్యం
మొత్తం ఎనిమిది మంది తలపడిన తుది సమరంలో ఆరంభం నుంచి ఆధిపత్యం ప్రదర్శించింది. సమీప ప్రత్యర్థిపై 1.1 పాయింట్ల ఆధిక్యంతో అగ్రస్థానంలో నిలిచింది. ఆమె వరుసగా 10.6, 10.8, 10.6, 10.8 పాయింట్లు సాధించి ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో నిలిచింది. ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో అపూర్వి కొట్టిన ప్రతీ షాట్ 10 పాయింట్ల కంటే ఎక్కువ ఉండటం విశేషం.

ఇది మూడో వ్యక్తిగత పతకం
నిబంధనల ప్రకారం తొలి 12 షాట్లు పూర్తయ్యాక ఎనిమిది మందిలో తక్కువ స్కోరు ఉన్న షూటర్ నిష్క్రమిస్తారు. ఆ తర్వాత ప్రతి రెండు షాట్లకు తక్కువ స్కోరుతో ఉన్న షూటర్ పతకం రేసు నుంచి వెనుదిరిగారు. వరల్డ్కప్లో అపూర్వికి ఇది మూడో వ్యక్తిగత పతకం. 2015లో కాంస్యం నెగ్గిన ఆమె.. అదే ఏడాది జరిగిన మరో వరల్డ్కప్లో రజతం సాధించింది.

కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యం గెలిచిన అపూర్వి
కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యం గెలిచిన అపూర్వి.. గతేడాది ఆసియాకప్లో స్వర్ణంతో మెరిసింది. 60 దేశాల నుంచి మొత్తం 500 మంది అథ్లెట్లు పోటీల్లో పాల్గొంటున్నారు. 2020 టోక్యో ఒలింపిక్స్కు క్వాలిఫయింగ్ ఈవెంట్ అయినప్పటికీ గతేడాదే 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత్ గరిష్టంగా రెండు బెర్త్లు ఖాయం చేసుకోవడంతో అపూర్వి తాజా ప్రదర్శనకు ఒలింపిక్ బెర్త్ దక్కలేదు.

పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం
"నా పతకాన్ని పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన జవాన్లకు అంకితం ఇస్తున్నా. గతేడాది నుంచి స్థిరంగా రాణిస్తున్నా. మున్ముందు కూడా సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నా. ఈ ప్రదర్శనతో సంతృప్తి చెందట్లేదు. ఇంకా మెరుగైన స్కోరు కోసం ప్రయత్నిస్తా. ఎప్పటికప్పుడు నాకు నేనే స్ఫూర్తినిచ్చుకుంటా" అని చండేలా చెప్పింది.


Click it and Unblock the Notifications
