హైదరాబాద్: దక్షిణ కొరియాలోని చాంగ్వాన్ వేదికగా జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్లో భారత్ షూటర్లు సరికొత్త చరిత్ర సృష్టించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 11 స్వర్ణాలతో పతకాల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది.
పాక్ పేసర్ ఆమిర్ను ఎదుర్కొనేందుకు లంక బౌలర్ నువాన్తో టీమిండియా ప్రాక్టీస్
పోటీల్లో చివరిరోజైన శుక్రవారం రెండు స్వర్ణాలు, ఓ రజతం భారత్ ఖాతాలో చేరడంతో... మొత్తంగా 27 పతకాల (11 స్వర్ణాలు, 9 రజతాలు, 7 కాంస్యాలు)తో మూడో స్థానంతో ముగించింది. చివరిరోజు మన షూటర్లు చెలరేగిపోయారు. చివరి రోజు జూనియర్ విభాగంలో రెండు స్వర్ణాలు, సీనియర్ విభాగంలో ఓ రజతం సాధించారు.
జూనియర్ 25 మీటర్ల పిస్టల్ విభాగంలో 16 ఏళ్ల విజయ్వీర్ 572 పాయింట్లతో స్వర్ణ పతకం సాధించాడు. ఇక, టీమ్ విభాగంలో విజయ్వీర్ (564), రాజ్కన్వర్ సింగ్ సంధు (564), ఆదర్శ్ సింగ్ (559)లతో కూడిన భారత జట్టు 1695 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది.
మరోవైపు కొరియా (1693), చెక్ రిపబ్లిక్ (1674) వరుసగా రజత, కాంస్యాలు సొంతం చేసుకున్నాయి. సీనియర్ 25 మీటర్ల పిస్టల్ విభాగంలో గురుప్రీత్ సింగ్ 579 పాయింట్లతో రజతం సాధించాడు. టీమ్ విభాగంలో గురుప్రీత్, అమన్ప్రీత్ సింగ్, విజయ్ కుమార్లతో కూడిన భారత బృందం 1699 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది.
2020 టోక్యో ఒలింపిక్స్కు క్వాలిఫయింగ్ ఈవెంట్గా నిర్వహించిన ఈ టోర్నీలో భారత్ రెండు ఒలింపిక్ బెర్త్లను సొంతం చేసుకుంది. అంజుమ్ మౌద్గిల్, అపూర్వీ చండీలా 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఈ బెర్త్లు సాధించిన సంగతి తెలిసిందే.