అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) జూనియర్ ప్రపంచకప్ టోర్నమెంట్లో హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్ అదరగొట్టింది. జర్మనీలోని సాల్ నగరంలో జరుగుతున్న ఈ టోర్నీలో 14 ఏళ్ల ఇషా బుధవారం మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో రజత పతకం సాధించింది. ఫైనల్స్లో ఇషా సింగ్ 236.6 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలిచింది. ఇషాకు ఇదే తొలి అంతర్జాతీయ పతకం. టర్కీ షూటర్లు సెవాల్ ఇల్యాద (241.8)కు స్వర్ణం, యాస్మిన్ బెయాజ (215.4)కు కాంస్య పతకాలు సాధించారు.
'ప్రతీసారి ఆటగాళ్లతో ప్రయాణిస్తే మనకు మరో సింధు దొరకదు'
జూనియర్ పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్లో అనీష్ భన్వాలా పసిడి పతకం సాధించాడు. ఫైనల్స్లో అనీష్ 29 పాయింట్లు స్కోరు చేసి స్వర్ణ పతకం అందుకున్నాడు. ఇక 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత జోడీ శ్రేయా-యష్ వర్ధన్ రజతం సాధించింది. ఇదే విభాగంలో మరో భారత జంట మెహులీ ఘోష్-హృదయ్ హజారికా కాంస్య పతకం గెలిచింది.
వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్ వేదికపై నిర్వహిస్తున్న టెస్ట్ ఈవెంట్ ఆర్చరీ టోర్నమెంట్లో భారత స్టార్ క్రీడాకారిణి దీపిక కుమారి రజత పతకం సాధించింది. బుధవారం జరిగిన మహిళల వ్యక్తిగత రికర్వ్ ఫైనల్లో దక్షిణ కొరియా ఆర్చర్ యాన్ సాన్పై దీపిక 0-6 తేడాతో ఓడిపోయింది. దీపిక వరుసగా మూడు సెట్లను 26-27, 25-29, 28-30తో చేజార్చుకుంది.
తొలి రౌండ్లో దీపిక 6-0తో లీ షుక్ క్వాన్ (హాంకాంగ్)పై, రెండో రౌండ్లో 6-4తో అనస్తాసియా పావ్లో వా (ఉక్రెయిన్)పై, మూడో రౌండ్లో 6-0తో వాకా సొనాడా (జపాన్)పై, క్వార్టర్ ఫైనల్లో 6-5తో తాతియానా ఆండ్రోలి (ఇటలీ)పై, సెమీఫైనల్లో 6-0తో జెంగ్ యిచాయ్ (చైనా)పై విజయం సాధించింది. అయితే ఫైనల్లో మాత్రం ఓడిపోయి రజత పతకంతో సరిపెట్టుకుంది.