
సిడ్నీ: కరోనా వైరస్ మహమ్మరికి సంబందించిన వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి వచ్చాకే టోక్యో ఒలింపిక్స్ నిర్వహించాలంటూ వస్తోన్న ప్రతిపాదనలపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సభ్యుడు జాన్ కోట్స్ అభ్యంతరం వ్యక్తం చేశారు. క్రీడల నిర్వహణకు సంబంధించి పలువురు శాస్త్రవేత్తలు, వైద్యులు సూచిస్తోన్న వ్యాక్సిన్ ప్రతిపాదనను తాను అంగీకరించనని బుధవారం ఆయన పేర్కొన్నారు. స్వయంగా లాయర్ అయిన జాన్ కోట్స్... డబ్ల్యూహెచ్వో మార్గదర్శకాలకు అనుగుణంగానే విశ్వ క్రీడల విషయంలో సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
'వ్యాక్సిన్ కనుగొంటే మంచిదే. కానీ డబ్ల్యూహెచ్వో, జపాన్ వైద్య సంస్థలు చెప్పిన ప్రకారమే మేము నడుచుకుంటున్నాం.ఒలింపిక్స్ వాయిదా పడినప్పటి నుంచి ఇప్పటివరకు చాలా పనులు జరిగాయి. రీషెడ్యూల్ తేదీకి క్రీడలు జరుగుతాయి. విశ్వక్రీడల కోసం ఇంకా 43 వేదికలు సిద్ధం చేసే పనిలో ఉన్నాం' అని జాన్ కోట్స్ అన్నారు. వాయిదా కారణంగా తమపై కొన్ని వందల మిలియన్ డాలర్ల అదనపు భారం పడనుందని ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ అన్నారు. 'వాయిదా కారణంగా కొత్తగా ఏర్పాటు చేయాల్సిన వసతులపై సమీక్షించాలి. నిర్వహణ వ్యయం పెరుగుతుంది. దీన్ని భరించేందుకు ఐఓసీ సిద్ధంగా ఉంది. కచ్చితంగా ఇది కొన్ని వందల మిలియన్ డాలర్లు ఉంటుందని ఆంచనా వేస్తున్నాం' అని బాచ్ పేర్కొన్నారు.
కరోనా వైరస్ మనుగడ కొనసాగితే వచ్చే ఏడాది కూడా టోక్యో ఒలింపిక్స్ నిర్వహణ అసాధ్యమని జపాన్ ప్రధాని షింజో అబే చెప్పారు. ఒలింపిక్స్ నిర్వహణపై ఎదురైన ప్రశ్నలకు బుధవారం షింజో సమాధానమిచ్చారు. 'అథ్లెట్లు, ప్రేక్షకులు సురక్షితంగా ఉండే పరిస్థితి వస్తే పూర్తిస్థాయిలో ఒలింపిక్స్, పారాలింపిక్స్ నిర్వహించాలన్నదే మా ఉద్దేశమని చెబుతూనే ఉన్నాం. ఒకవేళ కరోనా మహమ్మారి అప్పటిలోగా కట్టడి కాకుంటే ఒలింపిక్స్ జరుగడం అసాధ్యం' అని ప్రధాని చెప్పారు.
వచ్చే ఏడాదికి కరోనా వైరస్ నియంత్రణలోకి రాకపోతే టోక్యో 2020 ఒలింపిక్స్ను రద్దు చేయాల్సివుంటుందని నిర్వహణ కమిటీ అధ్యక్షుడు యొషిరో మోరి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ ఏడాది జూలైలో ప్రారంభం కావాల్సిన టోక్యో ఒలింపిక్స్ కరోనా వైరస్ తీవ్రత కారణంగా 2021కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజా షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది జూలై 23 నుంచి ఆగస్టు 8వ తేదీ వరకు విశ్వక్రీడలు జరగాల్సి ఉంది.