భారత టేబుల్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ అర్చన కామత్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రొఫెషనల్ ఆటకు దూరమవుతున్నట్లు తెలిపింది. అంతేగాక ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్తున్నట్లు వెల్లడించింది.ఈ నిర్ణయం భారత క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2028లో జరిగే ఒలింపిక్స్లో పతకానికి గ్యారెంటీ లేకపోవడం, టేబుల్ టెన్నిస్ ఆర్థికంగా భరోసా ఇవ్వలేకపోవడంతో అర్చన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పారిస్ ఒలింపిక్స్లో అర్చన కామత్ పోరాటాన్ని క్రీడాభిమానులు అంత సులువుగా మరిచిపోలేరు. ఒలింపిక్స్లో టేబుల్ టెన్నిస్లో భారత జట్టు తొలిసారి క్వార్టర్ ఫైనల్స్కు చేరడంలో అర్చనది కీలకపాత్ర. క్వార్టర్స్లో జర్మనీ చేతిలో భారత్ ఓడినప్పటికీ అర్చన సత్తాచాటింది. భారత్ జట్టులో విజయం సాధించిన ఏకైక యోధురాలు అర్చననే. మహిళల టీమ్ విభాగంలో భారత్ 1-3తో జర్మనీ చేతిలో పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే.

ప్రపంచ పోటీతో పోలిస్తే భారత టేబుల్ టెన్నిస్ వెనుకపడి ఉంది. పారిస్ విశ్వక్రీడల్లో మనికా బత్రా, ఆకుల శ్రీజ రౌండ్-16కు చేరుకోవడమే వ్యక్తిగత విభాగాల్లో భారత అత్యుత్తమ ప్రదర్శన. కానీ గత కొన్నాళ్లుగా టేబుల్ టెన్నిస్లో భారత్ పురోగతి సాధిస్తోంది. 24 ఏళ్ల పాడ్లర్ అర్చన కూడా రాణిస్తోంది. కానీ అర్చన నిర్ణయం అందర్నీ ఆశ్చర్యంలోకి నెట్టింది.
పారిస్ ఒలింపిక్స్ అనంతరం తన కోచ్ అన్షుల్ గార్గ్తో కలిసి అర్చన తన అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడించింది. దీని గురించి గార్గ్ జాతీయ మీడియాతో మాట్లాడాడు. పతకానికి భారత్ చాలా దూరంలో ఉందనే విషయాన్ని ఒప్పుకున్నారు. ''కష్టమని ఆమెకు చెప్పాను. తీవ్రంగా కష్టపడాల్సి ఉంటుంది. ప్రపంచ టాప్-100 వెలుపల ఆమె ఉంది. అయితే గత కొన్ని నెలలుగా అర్చన చాలా మెరుగుపడింది. కానీ ఆమె ఆటను విడిచిపెట్టాలని నిర్ణయించుకుంది. ఒక సారి మనస్సు నిర్ణయించుకుంటే దాన్ని మార్చడం చాలా కష్టం'' అని గార్డ్ పేర్కొన్నారు.
అర్చన తండ్రి గిరీష్ మాట్లాడుతూ.. ''అర్చన చదువును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. 15 ఏళ్లకు పైగా ఎంతో అంకితభావంతో టేబుల్ టెన్నిస్ ఆడింది. ఒలింపిక్స్లో దేశం తరఫున ప్రాతినిథ్యం వహించింది. ఇప్పుడు తన ఇతర అభిరుచి గురించి ఆలోచించడానికి సరైన సమయంగా నిర్ణయించుకుంది. దేశం కోసం తన అత్యుత్తమ సేవలు అందించిన తర్వాత ఈ కష్టమైన దశను తీసుకుంది'' అని తెలిపారు.