
హైదరాబాద్: అంతర్జాతీయ ఆర్చరీలో వరుసగా పతకాలు సాధిస్తున్న తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అరుదైన ఘనత అందుకుంది. జ్యోతి సురేఖ సభ్యురాలిగా ఉన్న భారత కాంపౌండ్ ఆర్చరీ టీమ్ కొత్త చరిత్ర సృష్టించింది.
అంతర్జాతీయ ఆర్చరీ సమాఖ్య గురువారం విడుదల చేసిన ర్యాంకింగ్స్లో జ్యోతి సురేఖ, త్రిషా దేబ్, లిలీ చాను, ముస్కాన్ కిరార్, దివ్య, మధుమితాలతో కూడిన కాంపౌండ్ ఆర్చరీ జట్టు మొత్తం 342.600 పాయింట్లు సాధించి తొలిసారి ప్రపంచ ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
ఇటీవల బెర్లిన్ వేదికగా జరిగిన వరల్డ్కప్ స్టేజ్-4 టోర్నమెంట్ కాంపౌండ్ ఆర్చరీ టీమ్ విభాగంలో భారత జట్టు రజతం గెలుచుకున్న సంగతి తెలిసిందే. దీంతో 342.600 పాయింట్లతో భారత జట్టు నెంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఆరుపాయింట్లు వెనకబడి చైనీస్ తైపీ జట్టు రెండోర్యాంక్తో సరిపెట్టుకుంది.
భారత జట్టు ఈ ఘనత సాధించడంలో తెలుగు తేజం జ్యోతి సురేఖ కీలక పాత్ర పోషించింది. ఇటీవల జరిగిన వరల్డ్కప్ స్టేజ్-4 టోర్నీలో పాల్గొన్న ఆమె నాలుగింటిలోనూ పతకాలు నెగ్గింది. ఇక మహిళల టీమ్ ఈవెంట్లో టాప్లో నిలిచిన జ్యోతి సురేఖ.. అభిషేక్ వర్మ జతగా కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో ప్రపంచ ఐదో ర్యాంక్ను అందుకొంది.