యూకేలో జరిగే ప్రముఖ ఆదిదాస్ మాంచెస్టర్ మారథాన్లో తాజాగా కనిపించిన ఒక దృశ్యం అందరి దృష్టినీ ఆకర్షించింది. భారత్కు చెందిన మధుస్మిత జేనా అనే మహిళ.. ఈ మారథాన్లో పాల్గొంది. మాంచెస్టర్లోనే నివశించే ఆమెకు ఇలాంటి రేసులు అంటే చాలా ఇష్టం. అందుకే ఈ మారథాన్లో కూడా పరుగులు తీసింది. అయితే ఈ క్రమంలో ఆమె వేసుకున్న దుస్తులు చర్చనీయాంశంగా మారాయి.
సాధారణంగా రన్నింగ్ అంటే టీషర్ట్, స్వెట్ ప్యాంట్ వేసుకొని చేస్తారు. కానీ మధుస్మిత మాత్రం ఇలాంటివి ఏవీ వేసుకోలేదు. భారత సంప్రదాయ వస్త్రాలైన చీర, జాకెట్ వేసుకొని ఆమె పరుగులు తీసింది. 41 కిలోమీటర్ల ఈ రేసును ఆమె గంటా 50 నిమిషాల్లో పూర్తి చేసింది. మధుస్మిత వయసు 42 సంవత్సరాలు కావడం గమనార్హం. ఆమె ఇలా భారత సంస్కృతిని ప్రచారం చేయడాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు.

'యూకేలోని మాంచెస్టర్లో నివశించే మధుస్మిత్ జేనా అనే భారతీయురాలు.. మాంచెస్టర్ మారథాన్ 2023లో అందరమైన సంబాల్పురి చీర కట్టుకొని పూర్తి చేశారు. ఆమె ఈ రేసులో చాలా కంఫర్టబుల్గా పరుగు తీయడం అందరి దృష్టినీ ఆకర్షించింది. తన భారత సంస్కృతిని గర్వంగా ప్రదర్శించిన ఆమె.. భారత్లో ధరించే ఈ దుస్తులపై కొత్త పర్స్పెక్టివ్ను అందించింది' అంటూ యూకేలోని ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ సంస్థ పేర్కొంది.
ఈ రేస్కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు చూసిన చాలా మంది నెటిజన్లు మధుస్మిత చేసిన పనిని మెచ్చుకుంటున్నారు. కానీ కొందరు మాత్రం ఈ దుస్తుల్లో రేస్లో పరిగెత్తడం అంత సులభమా? అని ప్రశ్నించారు. ఆమె సాధారణ రేసింగ దుస్లులు వేసుకొని ఉంటే ఆమె ఈ మారథాన్ను ఇంకెంత తొందరగా పూర్తి చేసేదో ఆలోచించండి అని అంటున్నారు. ఆమె చేసిన పని బాగుంది కానీ, ప్రాక్టికల్గా చీరలో పరిగెత్తడం అంత ఈజీ కాదు కదా అని కామెంట్లు చేస్తున్నారు.