బీహార్లోని రాజ్గిర్లో జరిగిన ఎమిరేట్స్ అండర్-20 ఏషియా రగ్బీ సెవెన్స్ ఛాంపియన్షిప్లో భారత అండర్-20 మహిళల జట్టు అద్భుతమైన ప్రదర్శనతో కాంస్య(Bronze) పతకాన్ని సాధించింది. ఈ టోర్నమెంట్కు మొదటిసారిగా భారత్ ఆతిథ్యం ఇవ్వడం విశేషం. స్వదేసంలోనే ఈ విజయం సాధించి చరిత్ర సృష్టించారు.
భారత మహిళల జట్టు ప్రయాణం
భారత మహిళల జట్టు పూల్ దశలో అద్భుతమైన ప్రదర్శనతో సెమీ ఫైనల్స్లోకి ప్రవేశించింది. సెమీఫైనల్లో బలమైన చైనా జట్టుతో తలపడి 7-28 తేడాతో ఓటమి పాలైంది. అయితే కాంంస్య పతకం కోసం ఉజ్బెకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత జట్టు సత్తా చాటింది. భూమిక మొదటి ట్రైతో 7-0 స్కోరును నమోదు చేయగా.. గురియా కుమారి రెండో ట్రైతో ఆధిక్యాన్ని 12-0కి పెంచింది. ఉజ్బెకిస్థాన్ ఒక ట్రై చేసి తిరిగి పుంజుకోవడానికి ప్రయత్నించినప్పటికీ భారత రక్షణ బలంగా ఉండటంతో 12-5 తేడాతో విజయం సాధించింది.

ఈ టోర్నమెంట్లో భారత్కు ఎదురైన రెండు ఓటములు కూడా చైనా, హాంకాంగ్ చైనా జట్ల చేతిలోనే.. ఈ రెండు జట్లు ఫైనల్కు చేరాయి. ప్రధాన కోచ్ కియానో ఫూరి మార్గదర్శకత్వంలో యువ, అనుభవజ్ఞులైన క్రీడాకారిణులు అద్భుతమైన టీంవర్క్ ప్రదర్శించి కాంస్య పతకం సాధించారు.
గర్వకారణమైన క్షణం
రగ్బీ ఇండియా అధ్యక్షుడు రాహుల్ బోస్ ఈ విజయంపై మాట్లాడుతూ.. ఇది భారత రగ్బీకి చరిత్రాత్మక క్షణమని అన్నారు. స్వదేశంలో ప్రేక్షకులతో కాంస్య పతకం గెలవడం గొప్ప విజయం అని, ఈ విజయం తర్వాతి తరం క్రీడాకారులకు స్ఫూర్తిని ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.
టోర్నమెంట్ తుది ఫలితాలు
మహిళల ఫైనల్: చైనా vs హాంకాంగ్ చైనా, 29-21 తేడాతో చైనా విజేతగా నిలిచింది.
మహిళల కాంస్యం: ఇండియా vs ఉజ్బెకిస్తాన్, 12-5 తేడాతో భారత్ విజయం సాధించింది.
పురుషుల ఫైనల్: హాంకాంగ్ చైనా vs శ్రీలంక, 33-0 తేడాతో హాంకాంగ్ చైనా విజేతగా నిలిచింది.
పురుషుల కాంస్యం: మలేషియా vs చైనా, 19-7 తేడాతో మలేషియా విజయం సాధించింది.