ఈ ఏడాది జరుగుతున్న స్క్వాష్ వరల్డ్ కప్కు భారత దేశం ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సొంతగడ్డపై జరుగుతున్న ఈ వరల్డ్ కప్లో ఆతిథ్య భారత జట్టు టైటిల్ సాధించేలా కనిపిస్తోంది. భారత జట్టు తన గ్రూప్లో వరుసగా రెండో విజయం నమోదుచేసింది. దీంతో గ్రూప్లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సెమీఫైనల్స్ చేరుకుంది.
గ్రూప్-బిలో భాగంగా బుధవారం జరిగిన పోరులో 4-0తో దక్షిణాఫ్రికాను భారత్ చిత్తుగా ఓడించింది. చేసింది. తొలి మ్యాచ్లో తన్వీ ఖన్నా 7-4, 7-2, 3-7, 7-2తో హేలీ వార్డ్పై సునాయాస విజయం సాధించింది. తొలి రెండు రౌండ్స్లో చెలరేగిన ఆమె.. ప్రత్యర్థికి కనీసం ప్రతిఘటించే అవకాశం కూడా ఇవ్వలేదు. అయితే మూడో సెట్లో హేలీ పుంజుకుంది. కానీ చివరి సెట్లో చెలరేగిన తన్వీ మ్యాచ్ను తన ఖాతాలో వేసుకుంది.

ఇక రెండో మ్యాచ్లో సౌరవ్ ఘోశాల్ 7-6, 7-4, 7-1తో డెవాల్డ్ వాన్ నీకెర్క్పై వరుసగా మూడు సెట్లతో విజయం సాధించాడు. తొలి సెట్లో కొంత పోటీ ఇచ్చిన డెవాల్ట్ ఆ తర్వాత ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయాడు. సౌరవ్ చెలరేగడంతో చిత్తుగా ఓడిపోయాడు. మూడో మ్యాచ్లో జోష్న చిన్నప్ప కూడా ఘన విజయం సాధించింది. ఆమె కూడా తొలి రెండు సెట్లలో ధాటిగా ఆడింది. అయితే మూడో సెట్లో ప్రత్యర్థి లిజల్ ముల్లర్ పైచేయి సాధించింది.
నాలుగో సెట్లో చెలరేగిన జోష్న చిన్నప్ప ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. దీంతో ఈ మ్యాచ్లో ఆమె 7-4, 7-3, 3-7, 7-1తో లిజల్ ముల్లర్ను చిత్తుచేసింది. ఆఖరి మ్యాచ్లో అభయ్ సింగ్ 7-4, 3-7, 7-6, 7-5తో జీన్ పెర్రీ బ్రిట్స్ను ఓడించాడు. తొలిరోజు హాంకాంగ్ను ఓడించిన టీమిండియా.. ఈ విజయంతో సెమీస్లో అడుగుపెట్టింది. గురువారం నాడు తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో జపాన్తో భారత్ తలపడుతుంది.