
ఒడిశా: ఏస్ ఇండియన్ స్ప్రింటర్ ద్యుతీ చంద్.. ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించారు. ప్రపంచ ర్యాంకింగ్స్ కోటా ద్వారా ద్యుతీకి ఒలింపిక్స్ బెర్త్ దక్కింది. ప్రపంచ ర్యాంకింగ్స్ కోటాలో 100 మీ, 200 మీ విభాగంలో ఆమె బెర్త్ ఖాయం చేసుకున్నారు. ఒలింపిక్స్లో 100 మీటర్ల పోటీల్లో 22 ఖాళీలు ఉండగా, 200 మీటర్ల పరుగు పందెంలో 15 ఖాళీలు ఉన్నాయి. 100 మీటర్ల విభాగంలో ప్రపంచ ర్యాంకింగ్స్లో 44వ స్థానంలో ఉన్న ద్యుతీ.. 200 మీటర్ల విభాగంలో 51వ స్థానంలో ఉన్నారు. గత వారం పాటియాలాలో జరిగిన ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్ 4లో ఆటోమేటిక్ ఒలింపిక్ అర్హత సమయాన్ని 0.02 సెకన్ల తేడాతో కోల్పోయారు.
దేశ అత్యున్నత క్రీడాపురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్రత్నకు స్ప్రింటర్ ద్యుతీ చంద్ పేరును ఒడిశా ప్రభుత్వం మంగళవారం నామినేట్ చేసింది. 'ఖేల్రత్న అవార్డుకు నా పేరు నామినేట్ చేసిన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారికి ధన్యవాదాలు. నా మీద మీ ఆశీర్వాదాలు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నా' అని ద్యుతీ చంద్ పేర్కొన్నారు. 2018 ఆసియా గేమ్స్లో 100 మీ, 200 మీ ఈవెంట్లో రజత పతకం గెలుపొందిన ద్యుతీని గతేడాది అర్జున అవార్డు వరించిన విషయం తెలిసిందే.
ద్యుతీ చంద్తో పాటు మరో ఐదుగురి పేర్లను రాజీవ్ గాంధీ ఖేల్రత్న అవార్డులకు సిఫార్సు చేశామని ఒడిశా ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. పురుషుల హాకీ వైస్ కెప్టెన్ బిరేంద్ర లక్రా (అర్జున అవార్డు), హాకీ కోచ్ కలు చరణ్ చౌదరీ (ద్రోణాచార్య అవార్డు), మాజీ స్ప్రింటర్ అనురాధ బిస్వాల్ (ధ్యాన్చంద్)ను ఆయా అవార్డులకు నామినేట్ చేసింది ఒడిశా ప్రభుత్వం. ప్రతిష్ఠాత్మక క్రీడా పురస్కారాలకు భారత క్రీడా సంఘాలన్నీ క్రీడాకారుల పేర్లు సిఫార్సు చేస్తున్నాయి. జూన్ 21తో ముగిసిన గడువును పొడిగించడంతో జాబితాలు సిద్ధం చేస్తున్నాయి.
భారత రెజ్లింగ్ సమాఖ్య సైతం నలుగురి పేర్లను అర్జున పురస్కారాల కోసం ప్రతిపాదించింది. ప్రపంచ ఛాంపియన్షిప్లో పతకాలు గెలిచిన రవి దహియా, దీపక్ పునియా, అన్షు మలిక్, సరితను ఎంపిక చేశారు. వీరు ఒలింపిక్స్లో పోటీపడే సంగతి తెలిసిందే. అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య.. టీమిండియా కెప్టెన్ సునిల్ ఛెత్రీ పేరును రాజీవ్ ఖేల్ రత్న కోసం సిఫార్సు చేసింది. దస్త్రాలు మాత్రం ఇంకా సమర్పించలేదని సమాచారం.