హైదరాబాద్: ఢిల్లీలో జరుగుతున్న షూటింగ్ వరల్డ్ కప్లో భారత షూటర్లు సత్తా చాటారు. భారత ఏస్ షూటర్లు హీనా సిద్ధు, జీతూరాయ్లు స్వర్ణ పతకాలు దక్కించుకున్నారు. 10 మీటర్ల మిక్స్డ్ డబుల్స్ విభాగం ఫైనల్లో జపాన్ షూటర్లను ఓడించిన ఈ జోడీ స్వర్ణం కైవసం చేసుకుంది.
షూటింగ్ వరల్డ్ కప్లో మిక్స్ డ్ డబుల్స్ విభాగం పోటీలు నిర్వహించడం ఇదే తొలిసారి. 2020 టోక్యో ఒలింపిక్స్లో షూటింగ్ విభాగంలో మిక్స్డ్ డబుల్స్ను ప్రవేశ పెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ప్రస్తుత వరల్డ్ కప్లో ఈ విభాగాన్ని ప్రవేశపెట్టారు.
అయితే ఇది సన్నాహక పోటీయే కావడంతో విజేతలకు పతకాలు అందజేయడం లేదని నిర్వాహకులు ప్రకటించారు. ఇదిలా ఉంటే షూటింగ్లో పురుషుల డబుల్ ట్రాప్ విభాగంలో 25 ఏళ్ల అంకుర్ మిట్టల్ సిల్వర్ పతకాన్ని సొంతం చేసుకున్నాడు.
అంకుర్ మిట్టల్ తండ్రి, సోదరుడు కూడా షూటర్లు కావడం విశేషం. పూజా ఘట్కర్ తర్వాత 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ సిల్వర్ పతకం సాధించిన షూటర్గా అంకుర్ మిట్టల్ రికార్డు సృష్టించాడు.నువ్వానేనా అన్నట్టుగా సాగిన డబుల్ ట్రాప్ ఫైనల్లో 24 ఏళ్ల అంకుర్ చివర్లో ఒత్తిడికి గురయ్యాడు.
మొత్తం 80 షాట్లలో వరుసగా మూడుసార్లు గురితప్పిన అతడు 74 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఒకేసారి గురితప్పిన జేమ్స్ విల్లెట్ (ఆస్ట్రేలియా) స్వర్ణ పతకం సాధించాడు. మరోవైపు ఇదే విభాగంలో ఫైనల్ చేరిన భారత షూటర్ సంగ్రామ్ దహియా ఆరో స్థానంతో నిలిచాడు. భారత యువ సంచలనం 15 ఏళ్ల శపథ్ భరద్వాజ్ పదో స్థానం దక్కించుకున్నాడు.
తొలిసారి అంతర్జాతీయ టోర్నీ ఆడుతున్న అతడు మొత్తం 132 పాయింట్లు సాధించాడు. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ విభాగంలో తేజస్విని సావంత్ ఏడో స్థానంలో నిలిచింది.
అంతక ముందు ఇదే ఈవెంట్లో పూజా ఘట్కర్ కాంస్య పతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే.