న్యూఢిల్లీ: కేరళలో జరుగుతున్న జాతీయ క్రీడల్లో హఠాన్మరణం చెందిన మహారాష్ట్ర నెట్బాల్ క్రీడాకారుడి కుటుంబానికి భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) రూ. 2 లక్షల పరిహారం ప్రకటించింది. మహారాష్ట్రకు చెందిన 21ఏళ్ల నెట్ బాల్ ఆటగాడు మయురిష్ పవార్ గుండెపోటు రావడంతో కుప్పకూలి ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే.
దీనిపై భారత ఒలింపిక్ సంఘం సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా మాట్లాడుతూ, అతని తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలిపారు. మయురిష్ పవార్ ఆత్మకు ఆ భగవంతుడు శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
అతని కుటుంబానికి భారత ఒలింపిక్ సంఘం తరుపున రూ. 2 లక్షలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. 'వెల్లయానిలోని ఇండోర్ స్టేడియంలో ప్రాక్టీస్ అనంతరం అతని గదికి వెళుతుండగా ఒక్కసారిగా అతడు కుప్పకూలిపోయాడు. వెంటనే అతనితోపాటు ఉన్న ఇతర సభ్యులు అతడ్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే అతడు చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు' అని అధికారులు తెలిపారు.