పూల్-ఏలో టాపర్గా భారత్
ఈసారి ఎలాగైనా స్వర్ణం సాధించాలన్న కసితో బరిలో దిగిన భారత పురుషుల స్క్వాష్ జట్టు.. ఆడిన ప్రతి మ్యాచ్లోనూ సత్తా చాటింది. ఈ క్రమంలోనే వరుసగా ఖతర్, పాకిస్తాన్, కువైట్, సౌత్ కొరియా, చైనీస్ తైపీ జట్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ మ్యాచులన్నింట్లో 3-0తో ఏకపక్షంగా విజయాలు నమోదు చేసి పూల్-ఏ టాపర్గా నిలిచింది. చివర్లో మలేషియా జట్టు మాత్రమే భారత్కు కొంత పోటీ ఇచ్చింది. సెమీఫైనల్లో ఈ జట్టును ఎదుర్కొన్న భారత్ 2-1 తేడాతో విజయం సాధించి ఫైనల్ చేరింది.
ఫైనల్లో కూడా అదే జోరు..
ఏషియన్ ఛాంపియన్షిప్స్ ఫైనల్లో కూడా భారత క్రీడాకారులో జోరు కొనసాగించారు. శుక్రవారం నాడు కువైట్తో జరిగిన ఫైనల్లో భారత స్టార్ ఆటగాళ్లు రమిత్ తాండన్, సౌరవ్ ఘోసల్ అదరగొట్టారు. తొలుత కువైట్ ఆటగాడు అలీ అర్మామెజితో తలపడిన రమిత్ తాండన్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. ఈ క్రమంలోనే 11-5, 11-7, 11-4 పాయింట్ల తేడాతో విజయం సాధించి భారత్కు ఆధిక్యం అందించాడు. రెండో మ్యాచ్లో సౌరవ్ ఘోసల్ విశ్వరూపమే చూపాడు. అమ్మర్ అల్టమిమిపై 11-9, 11-2, 11-3తో విజయం సాధించాడు.
చివరి మ్యాచ్ క్యాన్సిల్..
రమిత్, సౌరవ్ ఇద్దరూ ప్రత్యర్థికి కనీసం అవకాశం కూడా ఇవ్వకుండా ఏకపక్ష విజయాలు సాధించడంతో స్వర్ణపతకం భారత్కు ఖరారైంది. విజేత ఎవరో తేలిపోవడంతో అభయ్ సింగ్ ఆడాల్సిన మ్యాచ్ను నిర్వాహకులు క్యాన్సిల్ చేశారు. ఈ మ్యాచ్లో అభయ్తో ఫలా మహమ్మద్ తలపడాల్సి ఉంది. దీంతో అప్పటికే రెండు వరుస విజయాలు నమోదు చేసిన భారత పురుషుల జట్టు 2-0 తేడాతో కువైట్ను మట్టికరిపించి పసిడి పతకాన్ని గెలుచుకుంది.
మహిళలు కాంస్యంతోనే సరి
ఈ టోర్నీలో భారత మహిళలు కాంస్య పతకంతోనే సరిపెట్టుకున్నారు. టోర్నీలో అద్భుతంగా రాణించిన భారత మహిళల స్వ్వాడ్ బృందం.. టోర్నీలో రెండు విజయాలు, ఒక ఓటమితో పూల్-బిలో రెండో స్థానంలో నిలిచింది. ఇరాన్, సింగపూర్ జట్లను 3-0 తేడాతో ఓడించిన మహిళల జట్టు.. హాంగ్ కాంగ్ చేతిలో 3-0 తేడాతో ఓడింది. అనంతరం సెమీఫైనల్లో మలేషియాతో తలపడిన మహిళలు.. 1-2 తేడాతో ఓటమి చవి చూశారు. దీంతో ఈసారి కాంస్యంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.