భారత గ్రాండ్ మాస్టర్ వైశాలి రమేష్బాబు ఫిడే గ్రాండ్ స్విస్ టోర్నమెంట్లో చరిత్ర సృష్టించారు. ఆమె తన చివరి గేమ్ను మాజీ మహిళల ప్రపంచ ఛాంపియన్ టాన్ ఝోంగ్ యీతో డ్రా చేసుకుని వరుసగా రెండోసారి ఈ టైటిల్ను గెలుచుకున్నారు. ఈ విజయం ఒక చారిత్రక ఘనత.. ఎందుకంటే ఈ టోర్నమెంట్ను రెండు సార్లు గెలుచుకున్న మొదటి క్రీడాకారిణి ఆమెనే కావడం గమనార్హం. ఈ విజయంతో వైశాలి క్యాండిడేట్స్ టోర్నమెంట్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. కోనేరు హంపి, దివ్య దేశ్ముఖ్ తర్వాత క్యాండిడేట్స్ టోర్నమెంట్ కు అర్హత సాధించిన మూడో భారత మహిళా క్రీడాకారిణిగా ఆమె నిలిచారు.
ప్రధాని మోడీ అభినందనలు
ఈ అద్భుత విజయం సాధించిన వైశాలికి భారత ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు. తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో మోడీ ఇలా రాసుకొచ్చారు. "అద్భుతమైన ఘనత. రమేష్బాబు వైశాలికి అభినందనలు. ఆమె పట్టుదల, అంకితభావం ఆదర్శనీయం. ఆమె భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు." అని ప్రధాని మోడీ రాశారు.

అభినందించిన సోదరుడు ప్రజ్ఞానంద
ప్రధాని మోడీతో పాటు వైశాలి తమ్ముడు, ప్రముఖ గ్రాండ్ మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద కూడా తన సోదరిని అభినందించారు. ప్రజ్ఞానంద ఎక్స్ వేదికగా ఇలా రాసుకొచ్చారు. "అక్కా.. నాకు మీరు సాధించిన విజయంతో చాలా గర్వంగా ఉంది. ఫిడే మహిళల గ్రాండ్ స్విస్ గెలవడం ఒక అద్భుతమైన విజయం. టోర్నమెంట్ అంతటా మీరు చూపించిన ఆత్మవిశ్వాసం, సంకల్పం నిజంగా స్ఫూర్తిదాయకం. ఈ అద్భుతమైన విజయానికి చాలా చాలా అభినందనలు." అని ప్రజ్ఞానంద శుభాకాంక్షలు తెలిపారు.
ఓపెన్ సెక్షన్లో భారత స్టార్ ఆటగాడు అర్జున్ ఎరిగైసి తన చివరి గేమ్ను విన్సెంట్ కేమర్తో డ్రా చేసుకున్నాడు, దీంతో అతడు క్యాండిడేట్స్లో స్థానం దక్కించుకోలేకపోయాడు. ఈ సెక్షన్లో అనీష్ గిరి, జర్మన్ గ్రాండ్ మాస్టర్ మథియాస్ బ్లూబామ్ క్యాండిడేట్స్కు అర్హత సాధించారు