బెంగళూరు: టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై మాజీ వికెట్ కీపర్, బ్యాట్స్మన్ సయ్యద్ కిర్మాణీ ప్రశంసల వర్షం కురిపించారు. అలాగే కొన్ని సూచనలు కూడా చేశారు. ధోనీ ఆదర్శవంతమైన కెప్టెన్ అని కిర్మాణీ కొనియాడారు. ధోనీని భవిష్యత్లో కెప్టెన్లు అయ్యే ఆటగాళ్లు ఆదర్శంగా తీసుకోవాలని, వారు మైదానంలో కోతుల్లా వ్యవహరించొద్దని సూచించారు.
ప్రస్తుతం కొందరు కెప్టెన్లు, ఆటగాళ్లు మైదానంలో వ్యవహరించే తీరు అసలు బాగుండటం లేదని 1983 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన కిర్మాణీ అన్నారు. కొత్తగా ఎంపికైన టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో అంత దూకుడుగా ఉండటం మంచిది కాదని సూచించారు.
కెప్టెన్ అంటే దేశానికి ప్రచారకర్త లాంటివాడు అని చెప్పారు. అతడు ఎంతో హుందాగా వ్యవహరించాలని, ధోనీ అలాగే వ్యవహరిస్తున్నాడని తెలిపారు. అందుకే ధోనీ అడుగుజాడల్లోనే భావి కెప్టెన్లు నడవాలని సూచిస్తున్నట్లు చెప్పారు.

'కెప్టెన్ అంటే హుందాగా వ్యవహరించాలి. అతడు దేశానికి అంబాసిడర్ వంటివాడు. జెంటిల్మెన్లా వ్యవహరించాలి. ధోనీ అలాగే వ్యవహరిస్తాడు. మైదానంలో కోతుల్లా వ్యవహరించొద్దు. క్యాచ్ పట్టినప్పుడు గానీ, వికెట్ తీసినప్పుడు గానీ కోతిలా గెంతులు వేయడం చేయొద్దు. హుందాగా వ్యవహరించాలి. అలాంటి చేష్టలు ఫుట్బాల్ ఆటలో బాగుంటాయి. అవి జెంటిల్మెన్ గేమ్ అయిన క్రికెట్కు మంచిది కాదు. క్రికెట్ ఎప్పుడూ ఫుట్బాల్లా మారదు. అందులో చొక్కాలు విప్పి తిరుగుతారు' అని వన్ ఇండియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు.
పలు టీవీ కెమెరాలు ఉన్నందునే ఆటగాళ్లు మైదానాల్లో ఎక్కువ స్పందిస్తున్నారని ఈ మాజీ స్టంపర్ అభిప్రాయపడ్డారు. అది జెంటిల్మెన్ గేమ్ అయిన క్రికెట్ లో మంచిదికాదు అని చెప్పారు. ఈ విషయంలో మన్సూరు అలీ ఖాన్ పటౌడీ తర్వాత, ధోనీనే ఆదర్శవంతమైన కెప్టెన్, జీనియస్ అని కిర్మాణీ కీర్తించారు. అయితే అతని నాయకత్వంలో ఆడే అవకాశం తనకు లేకపోయిందని చెప్పారు.