హైదరాబాద్: టోక్యో ఒలింపిక్స్ లక్ష్యంగా భారత బాక్సర్లు తమ బరువులను మార్చుకోనున్నారు. జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ 2020 టోక్యో ఒలింపిక్స్ను దృష్టిలో ఉంచుకుని భారత స్టార్ బాక్సర్ల కేటగిరీలను మార్చింది. అమిత్ పాంగల్, శివ థాపా, మనీష్ కౌశిక్వంటి బాక్సర్లు పోటీ చేసే ప్రస్తుత కేటగిరీలను అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్(ఐబా) రద్దు చేసింది.
పాక్తో వన్డే సిరిస్: నిషేధం ముగిసినా స్మిత్, వార్నర్కు దక్కని చోటు!
అంతేకాకుండా ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఒక బాక్సింగ్ సమీక్ష వ్యవస్థను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దీంతో 2020 టోక్యో ఒలింపిక్స్లో అమిత్ ఫంగాల్ (49 కిలోలు), శివ థాపా, మనీష్ కౌశిక్ (60 కిలోలు) తమ బరువు విభాగాలను మార్చుకోనున్నారు.
అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య పురుషుల విభాగంలో ఎనిమిది, మహిళల విభాగంలో ఐదు పతకాంశాలను ఖరారు చేసింది. టోక్యో ఒలింపిక్స్లో పురుషుల విభాగంలో 52, 57, 63, 69, 75, 81, 91, 91+, మహిళల విభాగంలో 51, 57, 64, 69, 75 కిలోల విభాగాల్లో పోటీలుంటాయి.
దీంతో ఫంగాల్ 49 కిలోల నుంచి 52 కిలోలకు, శివ థాపా, కౌశిక్ 60 నుంచి 63 కిలోలకు మారనున్నారు. ఈ మార్పుపై ఇండియన్ బాక్సింగ్ హై ఫెర్ఫామెన్స్ డైరెక్టర్ సంటియాగో నివేయా మాట్లాడుతూ "దీనికి మేము సిద్ధంగానే ఉన్నాం. ప్రస్తుత బరువు కేటగిరీలను మార్చనున్నట్లు తెలిసింది. ఇందుకు భారత బాక్సర్లు తమ విభాగాలను మార్చుకునేందుకు సిద్ధంగానే ఉన్నారు. ఒలింపిక్ పతకం సాధించాలంటే ఇదొక్కటే మార్గం" అని అన్నారు.