హైదరాబాద్: కెనడాలోని టొరంటోలో జరిగిన 7వ ప్రపంచ మరుగుజ్జు క్రీడల్లో భారత అథ్లెట్లు తమ సత్తా చాటారు. వివిధ క్రీడల్లో భారత్ 37 పతకాలను గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో నిలిచింది. ఇందులో 15 బంగారు పతకాలు సహా, 10 రజత, 12 కాంస్య పతకాలు ఉన్నాయి.
ఈ మేరకు టొరంటోలోని ఇండియన్ హైకమిషన్ జనరల్ దినేష్ భాటియా ఒక ప్రకటనను విడుదల చేశారు. వారం రోజుల పాటు జరిగిన 7వ వరల్డ్ డ్వాఫ్ గేమ్స్లో 24 దేశాల నుంచి సుమారు 400 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. టొరొంటో ప్రావిన్స్లోని యూనివర్సిటీ ఆఫ్ గ్వెల్ఫ్లో ఈ పోటీలు నిర్వహించారు.

బ్యాడ్మింటన్, షాట్ పుట్, జావెలిన్, డిస్కస్ త్రో, వెయిట్ లిఫ్టింగ్ తదితర క్రీడాంశాల్లో పోటీ పడిన జాబీ మ్యాథ్యూ అత్యధికంగా రెండు గోల్డ్, మూడు సిల్వర్, ఒక బ్రాంజ్ మెడల్ గెలవగా, సీవీ రాజన్న రెండు బంగారు పతకాలు సొంతం చేసుకున్నాడు. ఈ పోటీల్లో సత్తా చాటిన భారత అథ్లెట్లకు అభినందనలు తెలుపుతూ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేయడంతో ఈ విషయం చాలా మందికి తెలిసింది.
ఇదిలా ఉంటే ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కెనడాలోని భారత దౌత్యకార్యాలయం వీరిని సత్కరించింది. ఈ సందర్భంగా తమ కంటూ ఒక ఒలింపిక్స్ లాంటి క్రీడల్ని నిర్వహించినందుకు కెనడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత్కు 15 బంగారు పతకాలను బహుమతిగా ఇస్తున్నామని భారత మరుగుజ్జు క్రీడాకారుల బృందం తెలిపింది. కాగా, ఈ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు కేంద్ర ప్రభుత్వం నుంచి గానీ, ఆయా క్రీడాకారుల రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గానీ ఎలాంటి సాయం అందలేదు.
21 మందితో కూడిన భారత జట్టు సొంత ఖర్చులతో కెనడా వెళ్లింది. ఇండియా నుంచి టొరంటో చేరుకున్న జట్టు సభ్యులు హోటల్ రూంలు అద్దెకు తీసుకునే పరిస్థితుల్లో లేకపోవడంతో శృంగేరి విద్యా భారతి ఫౌండేషన్ వారికి ఆశ్రయం కల్పించింది. మరుగుజ్జుల పోటీలో భారత టీమ్ సాధించిన ఘనతపై క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్ స్పందించారు.